అండర్వేర్లో కిలోన్నర బంగారం: ఎయిర్పోర్టులో పట్టేశారు
శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్, పోలీసు అధికారులుస్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్, పోలీసు అధికారులుస్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా తీసుకువస్తున్న బంగారం బిస్కెట్లను ఆర్జీఐ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గతంలో సొంత పనిపై సౌదీఅరేబియా వెళ్లారు.
స్వదేశానికి తిరుగువస్తూ తమ లోదుస్తుల్లో రహస్యంగా బంగారం బిస్కెట్లను పెట్టుకొని జెడ్డా విమానాశ్రయంలో ఏఐ 966 గల ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. శుక్రవారం ఆర్జీఐ విమానాశ్రయానికి చేరుకున్న వీరిని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో బంగారం గుట్టురట్టయ్యింది. నిందితులపై కేసు నమోదు చేశారు.
మాదక ద్రవ్యాల విక్రేతల అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలు విక్రయించే ఓ నైజీరియన్ను టాస్క్ఫోర్సు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.8 లక్షల విలువైన 125 గ్రాముల కొకైన్, 10 గ్రాముల హెరాయిన్, ఒక ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ.90 నగదు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్ఫోర్సు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి పురానీహవేలీలోని కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన చికేజీ ఓరిజీ అలియాస్ మిచేల్ (35) నాలుగేళ్ల క్రితం నగరానికి ఉద్యోగ వీసాపై వచ్చాడు. నార్సింగిలోని పీరాం చెరువులో ఉంటూ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నాడు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటుండడంతో 2015 జనవరిలో నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు.
తరవాత బెయిల్పై వచ్చిన మిచేల్ మాదకద్రవ్యాల విక్రయాలు కొనసాగిస్తున్నాడు. ఇతడు సైనిక్పురిలో ఉంటున్న అమెరికన్ ఈమేకా నుంచి గ్రాము హెరాయిన్ రూ.1500, గ్రాము కొకైన్ రూ.2000కు సేకరించి హెరాయిన్ గ్రాము 4000, కోకైన్ గ్రాము 6000కు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. కోఠి బస్టాపు (రూట్ నెం.94) వద్ద మిచేల్ను అదుపులోకి తీసుకున్నారు.