అందుకే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత..! ఆశ్యర్యం కలిగిస్తున్న తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాంటి భయంకర వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పూర్తిగా సహకరిస్తున్నందుకు జీతాల కోత ఏంటని వివిద ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు కూడా తమ పెన్షన్ లో ప్రభుత్వం కోత విధించే అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి ప్రభుత్వ వర్గాలు మాత్రం ప్రధానంగా అదే కారణం చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది.
జీతాల్లో కోత.. తెలంగాణ సర్కార్ వినూత్న నిర్ణయం..
ఇక ప్రజా ప్రతినిధులు పైకి కనిపించకపోయినప్పటికి తమ వేతనాల్లో 75శాతం కోత ఉంటుందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించడంతో గమ్మునుండి పోతున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత అంశం పట్ల ప్రభుత్వ వర్గాలు మాత్రం మరో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రజల మీద కరోనా పంజా విసిరాలని చూస్తుంటే, తెలంగాణ ఉద్యోగుల మీద మాత్రం పిడుగుపడినంత పనయ్యింది. ప్రభుత్వం ఇచ్చిన ఊహించని ట్విస్టుకు ప్రభుత్వ ఉద్యోగులు ఉసూరుమంటున్నారు.
లాక్ డౌన్ తో ఆర్ధిక భారం.. అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు..
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు వెయ్యి కోట్లైనా ఖర్చు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలంగాణ ప్రజానికం స్వాగతించింది. ప్రజల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న కృతనిశ్చయానికి హర్షం వ్యక్తం చేసారు తెలంగాణ ప్రజలు. అన్ని వర్గాల నుండి తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందిస్తూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు ప్రజలు. ఇంతలోనే ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధిస్తున్నామన్న సీఎం నిర్ణయంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డట్టు తెలుస్తోంది.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. తప్పదంటున్న ముఖ్యమంత్రి..
తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నప్పటికి గత కొన్ని నెలలుగా కనిపించని ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే గతంలో కేంద్రం నుండి పన్నుల రూపంలో రావాల్సిన వివిధ రకాల నిధులు సకాలంలో రావడంలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే ఆరోపించారు. అంతే కాకుండా వివిధ సందర్బాల్లో రాష్ట్ర అవసారాల నిమిత్తం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను సీఎం చంద్రశేఖర్ రావు అప్పు చేసారని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి మీద విజయం సాధించేందుకు బీకర యుద్దం చేస్తున్న తరుణంలో ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించండం మీద మాత్రం ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ప్రధాన ఆదాయ వనరు మద్యం.. మద్యం దుకాణాల బందుతో తీవ్ర ఆర్థిక నష్టం..
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు మద్యం. మద్యం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి గణనీయంగా నిధులు సమకూరుతుంటాయి. తెలంగాణ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు వారికి అందుబాటులో అనేక విదేశీ, స్వదేశీ మద్యం అందుబాటులో ఉంచుతుంది తెలంగాణ ప్రభుత్వం. అంతే కాకుండా తెలంగాణ ప్రజలకోసం కూడా అనేక బ్రాండ్లు నిత్యం అందుబాటులో ఉంచుతుంది అబ్కారి శాఖ. గత రెండు వారాల నుండి స్వీయ నియంత్రణ పేరుతో మద్యం షాపులు పూర్తిగా మూసివేయడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ స్ధాయిలో లోటు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఆర్థిక భారాన్ని అధిగమించేందుకే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రజాప్రతినిధుల జీతాల్లో భారీ కోత విధించారనే చర్చ కూడా జరుగుతోంది.