బ్యాట్ పట్టి సెంచరీ బాదేసిన సివి ఆనంద్: సికింద్రాబాద్ క్లబ్ విజయం
హైదరాబాద్: ఓ వైపు సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీవీ ఆనంద్ మరో వైపు ఆటలోన్లూ తనదైన శైలిలో సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ లీగ్ మ్యాచ్లో ఆనంద్ ఈ సీజన్లో మూడో శతకం సాధించాడు.
ఆదివారం జరిగిన మ్యాచులో ఆనంద్ (134 నాటౌట్, 17ఫోర్లు, 4సిక్సులు) సెంచరీలతో చెలరేగడంతో సికింద్రాబాద్ క్లబ్ ఏడు వికెట్ల తేడాతో ఎంపీ యంగ్మెన్ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంపీ యంగ్మెన్ 217 పరుగులకు ఆలౌటైంది.
కాగా, సివి ఆనంద్ బౌలింగ్ లోనూ రాణించి రెండు వికెట్లు(2/25) తీశాడు. అనంతరం సికింద్రాబాద్ క్లబ్ 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు సాధించింది. ఆనంద్ సెంచరీతో సత్తా చాటగా, జైదేవ్ రెడ్డి 42 పరుగులతో రాణించాడు.
గత వారం సెంచరీ(107)తో ఆకట్టుకున్న ఆనంద్ ఇప్పటికే మూడు శతకాలు సాధించారు. ఈ ఏడాది మొత్తం తానాడిన 11మ్యాచుల్లో ఆనంద్ 600కుపైగా పరుగులు చేశారు.