పాక్కు ముచ్చెమటలు పోయిస్తున్న హ్యాకర్లు, 'తెలంగాణ సైబర్ వార్' దాడి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ స్పేస్ పైన భారత్ హ్యాకర్లు తీవ్రంగా దాడి చేస్తున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం భారతకు చెందిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వంటి సైట్లను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. భారత సైన్యం పీవోకేలో చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం భారత్ను ఇబ్బంది పెట్టే యోచన చేశారు.
పాకిస్తాన్ హ్యాకర్లు పలు భారత సైట్లలోకి ప్రవేశించి తమ దేశభక్తి గేయాలను పోస్ట్ చేశారు. ప్రపంచానికి సాఫ్ట్వేర్లను సప్లై చేస్తోన్న దేశంగా పేరొందిన భారత్ వెబ్సైట్ల పైనే పాక్ హ్యాకర్లు ఇటువంటి చర్యకు పాల్పడడంతో భారత హ్యాకర్లు వారి హ్యాకింగ్ దాడికి ప్రతిదాడి మొదలుపెట్టారు.
పాకిస్థాన్ ప్రభుత్వ నెట్వర్క్లోకి సమర్థవంతంగా ప్రవేశించారు. ఆ దేశ ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లు, డేటాలను లాక్ చేస్తున్నారు. ఇటీవలే యూరీలో పాక్ ఉగ్రవాదుల చర్యకు మన సైనికులు దిమ్మతిరిగే సమాధానమివ్వడంతో పాక్ వెన్నులో వణుకుపుట్టింది.
ఇప్పుడు హ్యాకర్లు చేసిన ప్రతిదాడితో మరోసారి పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది. భారత హ్యాకర్లు చేసిన ఈ ఇంటర్నెట్ దాడిని ఎలా ఎదురించాలో తెలియని అక్కడి సైబర్ నిపుణులు అయోమయంలో పడ్డారని అంటున్నారు. చివరకు భారత హ్యాకర్లను వేడుకునే స్థితికి వచ్చారు.
తమ కంప్యూటర్లను అన్లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని చెబుతున్నారు. అయితే భారత హ్యాకర్లు వారిఆఫర్లను తిరస్కరిస్తున్నారు. దేశభక్తితోనే ఈ పని చేసిన భారత హ్యాకర్లు.. పాకిస్తాన్ ఇచ్చే ఆఫర్లు తమకు వద్దని చెబుతున్నారు. దీంతో పాక్ ఇబ్బందుల్లో పడింది.
పాకిస్తాన్ కనబరుస్తోన్న ధోరణి పట్ల భారతీయ హ్యాకర్లకు ఆగ్రహం తెప్పించింది. తమ పనిలో పనిగా భారత్ పైన ఆ దేశం చేస్తోన్న దుష్ప్రచారాన్ని భారతీయ హ్యాకర్లు తిప్పికొడుతున్నారు. భారత హ్యాకర్ల దెబ్బకి పాక్ ప్రభుత్వ సైట్లేవీ పని చేయడం లేదు. రాన్సమ్వేర్ను చొప్పించి పాక్ నెట్వర్క్ని స్తంభింపజేశారు.
కాగా, ఇందులో ఒక ఇండియన్ హ్యాకర్ను గుర్తించారని తెలుస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల మేరకు ఆ హ్యాకర్ 'తెలంగాణ సైబర్ వారియర్' మెంబర్ అని తెలుస్తోంది. వీరే పాకిస్తాన్ ప్రభుత్వ సిస్టంలను హ్యాక్ చేసి, వందలాది కంప్యూటర్లను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు.