కార్డుల క్లోనింగ్: నైజీరియన్లకు ఖాతాలు, ముంబైలో నివాసం
హైదరాబాద్: డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తూ బ్యాంకు ఖాతాదారుల నగదును దోచుకుంటున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని, ఇన్య్సూరెన్స్, ఇల్యూమిన్యూటీ క్లబ్ తదితర పేర్లు చెబుతూ అమాయకులను మోసం చేస్తున్న సైబర్ క్రిమినల్స్ను ముఠాను పట్టుకునేందుకు ముంబైలో గాలించిన సైబర్క్రైమ్ పోలీసులకు క్లోనింగ్ చేస్తున్న నిందితుడు చిక్కాడు.
నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న రాజేంద్ర సమర్జిత్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని విచారిస్తున్న సందర్భంలో అతని స్నేహితుడైన హైదరాబాద్కు చెందిన నల్లమోతుల అనిల్కుమార్ వర్మ గదికి రావడంతో అతన్ని ప్రశ్నించారు. అతడు కూడా నైజీరియన్లకు బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్నాడనే అనుమానంతో విచారణ చేయడంతో తాను హైదరాబాద్కు చెందిన వాడంటూ పోలీసులకు తెలిపాడు.
అతని గురించి ఆరా తీయడంతో అతనిపై ముంబయిలో డెబిట్ కార్డులు క్లోనింగ్ చేసిన కేసు ఉందని, అలాగే నైజీరియన్లతో దోస్తీ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడని తెలియడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్కు చెందిన అనిల్కుమార్కు కొన్నేళ్లుగా నేర చరిత్ర ఉన్నట్లు సమాచారం అందింది. డెబిట్, క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేసి, డబ్బులను బదిలీ చేసేందుకు స్వైపింగ్ చేసే మిషన్ను వాడుతున్నట్లు గుర్తించారు. అతని వద్ద స్వైపింగ్ మిషన్ లభ్యం కావడంతో దాని ద్వారా ఎన్ని రోజుల నుంచి లావాదేవీలు చేశాడు? ఏఏ అకౌంట్లకు నగదు బదిలీ చేశాడనే విషయాలను ఆరా తీస్తున్నారు.
ముంబై పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన కేసు వివరాలను తెలుసుకుంటున్నారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో ఇతనిపై గతంలో ఏమైనా కేసులున్నాయా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ అనిల్కుమార్ గతంలో చీటింగ్లకు పాల్పడుతూ అమాయకులను మోసం చేశాడనే ఆరోపణలున్నాయి.