సినీ క్రిటిక్ కత్తి మహేష్ అరెస్ట్... శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు...
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న కారణంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Recommended Video
రాముడిపై కత్తి మహేష్ అసభ్యకరమైన కామెంట్స్ చేశారని పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం(అగస్టు 14) విచారణ నిమిత్తం కత్తి మహేష్ను సైబర్ క్రైమ్ కార్యాలయానికి పిలిపించారు. అక్కడ విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. ఐపీఎస్ సెక్షన్ 153(A) కమ్యూనల్ యాక్ట్ కింద సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అరెస్టు అనంతరం మహేష్ను మొదట ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
అరెస్టుకు కొద్ది గంటల ముందు కత్తి మహేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. 'ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన బహుజన రచయితల సమావేశంలో శ్రీరాముడిపై నేను చేసిన వ్యాఖ్యలకు గాను నోటీసులు ఇవ్వడానికి ఈరోజు నన్ను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిచారు. అయితే ఫిబ్రవరి 14,2020న ఐమ్యాక్స్ వద్ద నాపై గూండాలు దాడి చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. ప్రాణాల కంటే మతాల సెంటిమెంట్లకే పోలీసులు ప్రాధాన్యం ఇవ్వడం నాకు ఆశ్చర్యంగా ఉంది.' అని కత్తి మహేష్ పేర్కొన్నారు.
గతంలో 2018లోనూ కత్తి మహేష్ శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయగా... అప్పటి పర్యవసానాల కారణంగా ఆర్నెళ్ల పాటు నగర బహిష్కరణను ఎదుర్కొన్నారు.సినీ క్రిటిక్గా పాపులర్ అయిన కత్తి మహేష్ రాజకీయాలు,సామాజిక అంశాలపై కూడా తనదైన అభిప్రాయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్టతో పాటు పలు సినిమాల్లో ఆయన నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆర్జీవీ 'పవర్ స్టార్' సినిమాలోనూ నటించారు.