ఫేక్ విజయ్ దేవరకొండ అరెస్ట్.. హీరో పేరుతో అమ్మాయిలకు గాలం.. ఇలా పట్టేసుకున్నారు..
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పేరుతో యువతులను మోసగించేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ దేవరకొండ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు పక్కా ప్లాన్తో అతన్ని పట్టుకున్నారు. ఇందుకోసం విజయ్ దేవరకొండ అసిస్టెంట్ గోవింద్ను రంగంలోకి దించారు. ఆ మోసగాడితో గోవింద్ను అమ్మాయిలా మాట్లాడించి ట్రాప్ చేశారు. గోవింద్ నిజంగా అమ్మాయే అని నమ్మిన అతను.. డైరెక్ట్గా కలిసేందుకు హైదరాబాద్ వచ్చి బుక్కయిపోయాడు.
ఎవరా ఫేక్ విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండకు యువతలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్,క్రేజ్ను అడ్డుపెట్టుకుని నిజామాబాద్ జిల్లా, మీర్జాపూర్కి చెందిన సాయికిరణ్ అనే యువకుడు యువతులను ట్రాప్ చేసేందుకు యత్నించాడు. ఇందుకోసం విజయ్ దేవరకొండ పేరుతో యూట్యూబ్లో ఓ ఛానల్ ప్రారంభించాడు. అందులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. ఇది హీరో విజయ్ దేవరకొండ నంబరే అని పొరపడ్డ కొంతమంది యువతులు ఆ నంబర్కు వాట్సాప్ మెసేజ్లు,కాల్స్ చేసేవారు.
డబ్బింగ్ ఆర్టిస్టుగా నమ్మించి విజయ్ గొంతుతో..
తన నంబర్కు వాట్సాప్ మెసేజ్లు చేసే యువతులతో.. సాయికృష్ణ చాటింగ్ చేసేవాడు. కొంతమంది యువతులు డైరెక్ట్గా కలుద్దామని అడిగితే.. ముందు తన అసిస్టెంట్తో మాట్లాడండి అని తన రెండో నంబర్ ఇచ్చేవాడు. తన అసిస్టెంట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తేనే వచ్చి కలుస్తానని చెప్పేవాడు. అలా రెండో నంబర్కు ఫోన్ చేసే అమ్మాయిలతో సాయికృష్ణ విజయ్ దేవరకొండ గొంతుతో మాట్లాడేవాడు. తాను విజయ్ అసిస్టెంట్ని అని.. ప్రస్తుతం డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నానని చెప్పేవాడు. ఇలా చాలామంది యువతులను ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతలో ఈ విషయం సన్నిహితుల ద్వారా హీరో విజయ్ దేవరకొండకు తెలిసింది.
పోలీసుల పక్కా ప్లాన్..
విజయ్ దేవరకొండ తన మేనేజర్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు సాయికృష్ణను పట్టుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. విజయ్ దేవరకొండ అసిస్టెంట్ గోవింద్ను హేమ పేరుతో రంగంలోకి దింపి సాయికృష్ణతో చాటింగ్ చేయించారు. ఒకసారి నీ గొంతు వినాలనుంది అని సాయికృష్ణ కోరడంతో... మరో అమ్మాయితో ఫోన్లో మాట్లాడించారు. ఆ సందర్భంలో సాయికృష్ణ విజయ్ దేవరకొండలా డైలాగ్స్ చెప్పాడు.
ఎల్బీనగర్లో అరెస్ట్..
నిజానికి విజయ్ దేవరకొండ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాక మీడియాలోనూ,సోషల్ మీడియాలోనూ దానిపై పెద్ద ప్రచారమే జరిగింది. కానీ సాయికృష్ణ మాత్రం అవేవీ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో గురువారం ఉదయం మెసేజ్ చేశాడు. ఈరోజు హైదరాబాద్ వస్తున్నానని.. రాత్రికి డేటింగ్ చేసి ఉదయం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. దీనికి అటువైపు నుంచి ఓకె అని బదులు రావడంతో.. ఇక నిజామాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు. అలా హైదరాబాద్కి వచ్చిన అతన్ని ఎల్బీనగర్లో క్యాబ్ కోసం వేచి చూస్తున్న సమయంలో.. పోలీసులే వెళ్లి క్యాబ్ పేరుతో కారులోకి ఎక్కించుకున్నారు. దీంతో ఎవరో తనను కిడ్నాప్ చేస్తున్నారంటూ సాయికృష్ణ హల్చల్ చేశాడు.
Recommended Video
కేసు నమోదు.. గ్రామస్తులకు అప్పగింత
అదే కారులో సాయిని పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ అతని నుంచి వివరాలు సేకరించి సీఆర్పీసీ 41-ఏ నోటీసులు జారీ చేశారు. విజయ్ దేవరకొండలా మాట్లాడితే యువతులు దగ్గరవుతారన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసినట్టు సాయికృష్ణ తెలిపాడు. తన తల్లి దివ్యాంగురాలు అని,తండ్రి లేడని చెప్పాడు. దీంతో సాయికృష్ణ గ్రామ పెద్దలకు ఫోన్ ద్వారా సమాచారం అందించి నగరానికి రప్పించారు. అనంతరం సాయికృష్ణను వారికి అప్పగించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.