ఎక్కడో ఉంటారు.. మాయ చేస్తారు.. బ్యాంకు మేనేజర్లను నమ్మించి నిండా ముంచేస్తారు..!
హైదరాబాద్ : బ్యాంకులే టార్గెట్గా ఓ ముఠా రెచ్చిపోయింది. కారు షో రూమ్ యజమానులుగా ఫోజులు కొడుతూ లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఫోన్ల ద్వారా మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్లను బురిడీ కొట్టిస్తూ ఘరానా గ్యాంగ్ కొత్త తరహా మోసాలకు తెర లేపింది. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బ్యాంకులకు అడ్డగోలుగా కన్నం పెడుతున్న ఈ ముఠా చివరకు పోలీసులకు చిక్కింది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చెలరేగిపోతున్న ముఠా హైదరాబాద్లోనూ ఇలాంటి తరహా మోసానికి పాల్పడింది. చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
ఆ నలుగురు కలిసి.. లక్షల్లో దోచేస్తున్నారు
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల అరుణ్ కుమార్.. ఢిల్లీ మయూర్ విహార్ నివాసి 33 ఏళ్ల లోకేశ్ తోమార్.. నోయిడాకు చెందిన 28 ఏళ్ల మోహిత్ కుమార్.. మీరట్కు చెందిన 35 ఏళ్ల మనోజ్ కుమార్ ఒకే గొడుగు కింద పనిచేస్తూ బ్యాంకులకు కన్నం వేస్తున్నారు. ఇందులో ఒకరు ఇతరుల పేరుతో బ్యాంకు ఖాతాలు సృష్టిస్తే.. మరొకరు కార్ల షో రూమ్ నెంబర్లు సేకరించడం చేస్తుంటారు. అలా ఓ పద్దతి ప్రకారం అరుణ్ కుమార్ చివరకు ప్లాన్ అమలు చేస్తాడు.
బ్యాంకు మేనేజర్లకు ఫోన్ చేస్తూ తనకు తాను ఫలానా కారు షోరూమ్ యజమానిగా చెబుతాడు అరుణ్ కుమార్. అదే బ్యాంకులో ఆ షోరూమ్కు ఖాతా ఉండటంతో బ్యాంకు మేనేజర్లు కూడా చెప్పండి సార్ అంటూ మర్యాదగా మాట్లాడతారు. అలా వారిని బురిడీ కొట్టిస్తూ లక్షలు కొల్లగొడుతోంది ఈ ముఠా.
ఛాటింగ్ చేస్తాడు.. కొంపలు ముంచుతాడు.. హైదరాబాద్ మహిళను వేధించి..!
షోరూమ్ యజమానులుగా బిల్డప్.. అనుమానం రాకుండా..!
బ్యాంకు మేనేజర్కు ఫోన్ చేసి చెక్కు పంపిస్తున్నానని.. అంతలోపు వేరే ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ క్రమంలో చెక్కు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఫోన్లో అరుణ్ కుమార్ చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసేస్తారు మేనేజర్లు. తమ ఖాతాదారులే కదా అనే ఉద్దేశంతో అర్జెంట్ అయి ఉంటుందని భావించి అరుణ్ కుమార్ చెప్పినట్లు చేస్తారు. చివరకు ఎంత సేపు ఎదురుచూసినా ఆ చెక్కు బ్యాంకుకు చేరదు.. తీరా సదరు ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అనే సమాధానం వస్తుంది.
ఆ నేపథ్యంలో అరుణ్కుమార్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ కార్ల షోరూం ఫోన్ నంబరు సేకరించాడు. ఈనెల 9వ తేదీన సదరు షోరూమ్కు ఫోన్ చేసి సేల్స్ సిబ్బందితో మాట్లాడాడు. తాను పేరొందిన కంపెనీ యజమానిగా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థకు చాలా కార్లు కావాలంటూ నమ్మించాడు. ఆ క్రమంలో సదరు షోరూమ్కు చెందిన వివరాలన్నీ కూపీ లాగాడు. పెద్ద సంస్థ యజమానిగా చెప్పడంతో షోరూమ్ సిబ్బంది అరుణ్ కుమార్కు పూసగుచ్చినట్లు వివరాలన్నీ వెల్లడించారు.
పకడ్బందీ ప్లాన్.. హైదరాబాద్లో కూడా బ్యాంక్కు కన్నం
అంతేకాదు మీ బ్యాంకు ఖాతా వివరాలు వాట్సాప్ ద్వారా పంపాలని.. షోరూమ్కు చెందిన బ్యాంకు చెక్కును ఫోటో తీసి షేర్ చేయాలని కోరాడు. పెద్ద గిరాకీ వస్తోందని సంబరపడిన అక్కడి సిబ్బంది అరుణ్ కుమార్ అడిగిన వివరాలతో పాటు చెక్కు కూడా ఫోటో తీసి పంపారు. ఇక అక్కడి నుంచి కొత్త డ్రామాకు తెర లేపాడు అరుణ్ కుమార్. ఆ తర్వాత షోరూమ్కు సంబంధించిన ఖాతా ఏ బ్యాంకులో ఐతే ఉందో ఆ బ్యాంకు మేనేజర్కు ఫోన్ చేశాడు. షోరూమ్ యజమానిగా చెప్పి.. మీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ పెద్దమొత్తంలో చేయాలనుకుంటున్నానని బోల్తా కొట్టించాడు.
ఆ మాట ఈ మాట మాట్లాడి తన సిబ్బందితో బ్యాంకుకు ఓ చెక్కు పంపిస్తున్నానంటూ సదరు షోరూమ్ సిబ్బంది నుంచి వాట్సాప్ ద్వారా సంపాదించిన చెక్కును బ్యాంక్ మేనేజర్కు షేర్ చేశాడు. అంతలోపు అర్జెంటుగా తాను చెప్పిన ఖాతాకు 8 లక్షల 20 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా సూచించాడు. అయితే ఇదంతా నిజమేనని నమ్మిన బ్యాంకు మేనేజర్ అరుణ్ కుమార్ చెప్పినట్లే అంత మొత్తం బదిలీ చేశారు.
అందమైన అమ్మాయిలు.. కోరుకున్న ప్యాకేజీలు.. 8 కోట్లకు ముంచారుగా..!
నలుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
అయితే ఎంత సేపటికీ చెక్కు రాలేదు. దాంతో అనుమానం వచ్చి షోరూమ్కు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది. దాంతో పోలీసులను ఆశ్రయించి కేసు ఫైల్ చేశారు బ్యాంక్ మేనేజర్. దర్యాప్తు మొదలుపెట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. 3 లక్షల రూపాయల నగదుతో పాటు పోలో కారు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.