ఆన్ లైన్ మద్యం డోర్ డెలివరీ పేరుతో సైబర్ నేరగాళ్ళు: మోసపోతున్న మందుబాబులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ ప్రభావంతో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి . ఇక ఓ వైపు కరోనా వైరస్ తో జనం భయాందోళన కు గురవుతుంటే మరోవైపు మద్యం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మందుబాబులు . ఇక ఇదే అదునుగా సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు .మద్యం ప్రియుల లిక్కర్ అవసరాలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఆన్ లైన్ అమ్మకాల పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు.
మందుబాబుల అవసరాలను బట్టి పెరుగుతున్న మోసాలు
మద్యం అమ్మకాలు లేకపోవటంతో జిహ్వ చాపల్యం ఆపుకోలేకపోతున్న మద్యం ప్రియులు ఎక్కువ ధరలు ఉన్నా సరే మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో బ్లాక్ లో దందా కొనసాగుతుంది . ఇక మందుబాబుల పరిస్థితి బట్టి నాలుగు రెట్లు అదనంగా ఛార్జీలు వేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక మద్యం దొరక్క కొంతమంది పిచ్చెక్కిపోతున్నారు. రోజుకు రెండు, మూడు గంటలైనా మద్యం షాపులు తెరవాలని డిమాండ్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు . ఇక ఇదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి.
జనాల లిక్కర్ అవసరాలను వదలని సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు జనాల లిక్కర్ అవసరాలను కూడా వదలటం లేదు .ఆన్ లైన్ లో మద్యం విక్రయిస్తున్నామని, ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే బాటిళ్లు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బగ్గా వైన్స్ పేరుతో ఒక వ్యక్తి 51 వేల రూపాయలు మోసపోతే ఇక తాజాగా మరో వ్యక్తి 92 వేలు సైబర్ నేరగాళ్లకు చెల్లించుకున్నారు . మొన్ననే బగ్గా వైన్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని చెప్పినా తాజాగా మరొక వ్యక్తి సైతం మోసపోవటం గమనార్హం .
మొన్న 51 వేలు ఇప్పుడు 92వేలు .. మోసపోయిన మద్యం ప్రియులు
ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో మద్యం బాటిళ్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఆర్డర్ ఇస్తే ఇంటి వద్దకే బాటిళ్లు పంపిస్తామని చెప్పటంతో మొన్న కేటుగాళ్ల మాటలు నమ్మి గౌలిపురాకు చెందిన ఓ వ్యక్తి 51 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే మద్యం ఇంటికి రాకపోవడంతో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశాడు. ఇక తాజాగా అరవింద్ అనే వ్యక్తిని సైతం సైబర్ నేరగాళ్ళు మోసం చేశారు . నిజంగానే ఇంటికి లిక్కర్ వస్తుందని నమ్మి రూ. 92 వేలు సమర్పించాడు. కానీ మద్యం బాటిళ్ళు మాత్రం రాలేదు . చివరకు తాను మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైం సెల్ కు ఫిర్యాదు చేశాడు.
Recommended Video
ఆన్ లైన్ మోసాలపై అప్రమత్తత అవసరం అంటున్న సైబర్ నిపుణులు
ఇక ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ప్రజల వీక్ నెస్ క్యాష్ చేసుకోవటం కోసం ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఇదంతా నమ్మకూడదని అంటున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని వైన్స్ , బార్లు, రెస్టారెంట్లు మూసివేశారని లిక్కర్ దొరికే చాన్స్ లేదని , ఒకవేళ ఎవరైనా అక్రమ మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనా పేరుతో కూడా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిని నమ్మకూడదని అంటున్నారు సైబర్ నిపుణులు .