భలే నమ్మించారు: విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల జీతమిస్తామని టోకరా (ఫోటోలు)
హైదరాబాద్: అమెరికా, కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు దండుకుని యువకులను మోసం చేస్తున్న ముగ్గురు సైబర్ క్రిమినల్స్ను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో గత రెండేళ్లుగా వీరు ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం విశేషం.
ఈ ముఠాలో ఇద్దరు నైజీరియన్లతో పాటు మిజోరం రాష్ర్టానికి చెందిన ఓ మహిళ కూడా ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన జేమ్స్ మార్టిన్ (27), క్రిష్టోఫర్ (32), మిజోరాంకు చెందిన లాచ్హెన్హెమీ అలియాస్ చెంటయ్ (32), ఇమాన్యుయేల్ (23) బెంగళూరులో కలిశారు.
మార్టిన్, క్రిష్టోఫర్ ఇద్దరూ బెంగుళూరులో ఉంటున్నారు. మిజోరం రాష్ర్టానికి చెందిన ఇమాన్యుల్ లలీతీయాగిమా(23), లాల్చనీమీ(32) కొంతకాలం కిందట సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇంటి యజమానితో రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.
అగ్రిమెంట్, నకిలీ ధ్రువీకరణ పత్రాలను చూపుతూ వివిధ బ్యాంకుల్లో 70 సేవింగ్ ఖాతాలు తెరిచారు. అనంతరం బెంగళూరులో ఉన్న మార్టిన్, క్రిష్టోఫర్లు జాబ్ పోర్టల్స్లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగుల జాబితా సంపాదించారు.
తమను తాము హెచ్ఆర్ మేనేజర్లుగా పరిచయం చేసుకుని అమెరికా, కెనడాలలో భారీ జీతాలతో కూడిన ఉద్యోగాలను ఆఫర్ చేశారు. బెంగళూరులో ఉంటూ అమెరికా, కెనడాలకు సంబంధించిన సిమ్ కార్డులతో మాట్లాడడంతో బాధితులు వీరి మాయలో పడిపోయారు.
తమ కంపెనీకి కావాల్సిన నైపుణ్యాలు మీకు ఉన్నాయని చెబుతూ.. పెద్ద మొత్తంలో వేతనం ఆఫర్ చేసేవారు. నెలకు ఐదారు లక్షల జీతం వస్తుందంటూ ఆశ చూపారు. బీమా కవరేజ్, ఇల్లు, కారు, కుటుంబానికి ఫస్ట్క్లాస్ రిటర్న్ టికెట్లు ఇస్తామని నమ్మబలికారు.
స్వదేశానికి వెళ్లేందుకు ఏటా రెండు నెలలు సెలవు కూడా మంజూరు చేస్తామంటూ బుట్టలో వేసుకున్నారు. ఫోన్ నెంబర్లు విదేశాలకు సంబంధించినవి కావటంతో తేలిగ్గా నమ్మారు. ఎల్బీనగర్, జీడిమెట్ల ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు వీరి వలలో పడ్డారు.
విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం
ఒక్కొక్కరు 5 లక్షల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయామని గ్రహించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలోని బృందం ఈ నేరగాళ్లను వల పన్ని శంషాబాద్ ప్రాంతంలో పట్టుకుంది.
విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అక్కడ లభించిన ఆధారాలు చూసి విస్మయానికి గురయ్యారు. కొరియా దేశానికి చెందిన పాప్ గాయని, నటి బే సూజీ పేరు మీద రెండు బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. ఆమె శంషాబాద్లో నివాసం ఉంటున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను తయారు చేశారు.
విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం
ఇందుకోసం ఫొటోషాపులో నిపుణురాలైన సైబర్ క్రిమినల్ లాల్చనీమీ సహాయం తీసుకున్నట్టు విచారణలో వెల్లడించారు. ప్రధాన నిందితుడు జేమ్స్ మార్టిన్ 45రోజుల కిందటనే నైజీరియన్ వెళ్లాడని పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల కిందటే మార్టిన్ నైజీరియా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం
మరో నైజీరియన్ క్రిస్టోఫర్ వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్నాడని తేలింది. ఈ ముగ్గురి నుంచి లక్ష నగదు, 15 బ్యాంక్ పాసుబుక్లు, 15 చెక్ బుక్లు, 13 ప్యాన్కార్డులు, 6 ఓటర్ కార్డులు, 13 డ్రైవింగ్ లైసెన్స్లు, 22 ఏటీఎం కార్డులు, 15 సిమ్కార్డులు, 6 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.