షాకింగ్: తియ్యని స్వరంతో అమ్మాయిలా.., కానీ మాట్లాడేది అబ్బాయే, యాప్ సాయంతో ముంచేస్తారు!
సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. వాయిస్ కన్వర్టర్ యాప్ల ద్వారా తమ గొంతును అమ్మాయిల గొంతుగా మారుస్తున్నారు. అమాయకులకు ఫోన్ చేసి తియ్యని మాటలు చెప్పి రూ.లక్షలు దోచుకుంటున్నారు.
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. వాయిస్ కన్వర్టర్ యాప్ల ద్వారా తమ గొంతును అమ్మాయిల గొంతుగా మారుస్తున్నారు. అమాయకులకు ఫోన్ చేసి తియ్యని మాటలు చెప్పి రూ.లక్షలు దోచుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు ఇద్దరు సైబర్నేరగాళ్లు దొరకడంతో ఈ విషయం బయటపడింది.
ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన సందీప్(33)కు ఈ ఏడాది మార్చిలో ఓ అమ్మాయి ఫోన్ చేసి తనతో సన్నిహిత సంబంధం కావాలంటే కూకట్పల్లి కి రావాలని చెప్పింది. అక్కడికి వెళ్లిన సందీప్ కు ఆ అమ్మాయి మాత్రం కలవలేదుకానీ ఓ వ్యక్తి దగ్గరికొచ్చి.. తాను మేడమ్ వాచ్మన్నంటూ పరిచయం చేసుకున్నాడు.
మేడమ్ దగ్గరికి వెళ్లేటప్పుడు ఫోన్, ఇతర వస్తువులు తీసుకెళ్లకూడదంటూ నమ్మించి సందీప్ పర్సు, మొబైల్ ఫోన్ తీసుకుని ఉడాయించాడు. తనను కలిసి వాచ్మన్నంటూ పరిచయం చేసుకున్న వ్యక్తే యాప్ సాయంతో గొంతు మార్చి అమ్మాయిలా మాట్లాడాడని తెలుసుకున్న సందీప్ నిర్ఘాంతపోయాడు.
ఆ యాప్ సాయంతో అమ్మాయిలా మాట్లాడి మోసం చేయడం తేలిక అని గ్రహించిన సందీప్ తాను కూడా అదేబాట పట్టాడు. ఇంటర్నెట్లో అమ్మాయిల ఫొటోలు పెట్టి 'నియర్బై' గ్రూప్ తయారు చేశాడు.
ఆ గ్రూప్ చూసి ఫోన్చేసిన వారితో వాయిస్ కన్వర్టర్ ద్వారా అమ్మాయి గొంతుకతో పరిచయం చేసుకొని, తనను కలవాలంటే ఫలానా ప్రాంతానికి రావాలని చెప్పేవాడు. వారు అక్కడికి చేరుకోగానే సేమ్ ప్లాన్ రిపీట్ చేసే వాడు.
తాము మేడమ్ వాచ్మన్నంటూ పరిచయం చేసుకొని వచ్చిన వారి ఫోన్, పర్సు, బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించేవాడు. కొంత మందితో నేరుగా ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయించుకున్నాడు.
చివరికి ముగ్గురు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మేడిపల్లి పోలీసులు సందీప్ను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడి మోసానికి గురైన బాధితులు 30 మందికిపైనే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
సైబరాబాద్ లో ఏం జరిగిందంటే...
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఫోన్ చేసింది. తాను లండన్లోని ఓ ఫార్మా కంపెనీలో మేనేజర్గా పని చేస్తున్నానని నమ్మబలికింది.
తమ కంపెనీకి విత్తనాలు సరఫరా చేస్తే లాభాలు గడించవచ్చని నమ్మించింది. దీంతో ఆ వ్యాపారి రూ.1.85 లక్షలను సైబర్ ఛీటర్స్ ఖాతాలో జమచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితుడైన ముంబైకి చెందిన మహ్మద్ అలీని అరెస్ట్ చేశారు.
విచారణలో.. అతడు వాయిస్ కన్వర్టర్ను ఉపయోగించి అమాయకులకు ఫోన్ చేసేవాడని తేలింది. స్వీట్ వాయిస్ కోసం నిందితుడు నిషేధిత వెబ్సైట్ల నుంచి రూ.వేలు వెచ్చించి యాప్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు.