మల్టీ లెవల్ మోసం: ఏడో తరగతి చదివి, రూ.1200 కోట్లు ముంచారు, విమానమే కొన్నాడు
హైదరాబాద్: మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగు చూసింది. ఏడో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా రూ.1200 కోట్ల మేర కొల్లగొట్టాడు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ ఉంది. సైబరాబాద్ పోలీసులు నిందితుడు రాధేశ్యామ్ను అరెస్ట్ చేశారు. ఇతను హర్యానాకు చెందినవాడు.
ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రయివేటు లిమిటెడ్ సీఎండీ రాధేశ్యామ్, అతనికి సహకరించిన అతని అనుచరుడు సురేందర్ సింగ్ను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. మూడేళ్ల వ్యవధిలోనే అతను రూ.1200 కోట్లు కుచ్చుటోపీ పెట్టాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో విషయం వెలుగు చూసింది.
దొంగతనానికి వచ్చి గన్ పారేసుకొని.. ఫన్నీ వీడియో: బెడిసికొట్టిన ప్లాన్
ఆకర్షణీయ పథకం
ఒకసారి రూ.7500 కడితే రూ.5వేల విలువైన ఉత్పత్తులు ఇస్తామని, ఆ తర్వాత 24 వెలల పాటు నెలకు రూ.2500 చొప్పున రూ.60 వేలు ఇస్తామని చెబుతాడు. వేరేవారిని ఇందులో చేర్పిస్తే రూ.500 అదనంగా వస్తుందని చెబుతాడు. ఈ ఆకర్షణీయ పథకంతో పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టవచ్చునని ప్రజలు చాలామంది పెట్టుబడి పెట్టారు. ఇలా రూ.1200 కోట్లు కూడబెట్టాడు.
వేరేచోట పని చేసి ఆ అనుభవంతో
అతను దాదాపు ఇరవై లక్షల మందిని మోసం చేశాడు. తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల మంది వరకు ఉన్నారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో రిమాండులోకి తీసుకున్నారు. రాధేశ్యామ్, సురేందర్ సింగ్లు గతంలో పలు మల్టీ లెవల్ కంపెనీల్లో పని చేశారు. ఆ అనుభవంతో వారే కొత్తగా కంపెనీ పెట్టి పథకం వేశారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ గ్లోబల్ మార్కెటింగ్ ప్రయివేటు లిమిటెండ్ను మూడేళ్ల క్రితం ఢిల్లీలో ప్రారంభించారు.
ఏడో తరగతి చదవి, ఆరేడు నెలల్లో ఆకళింపు చేసుకొని
రాధేశ్యామ్ వయస్సు 33. అతను చదివింది ఏడో తరగతి. హర్యానాలోని హిస్సార్ రాష్ట్రానికి చెందినవాడు. ఢిల్లీకి చెందిన ఓ మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలో చేరి కేవలం ఆరేడు నెలల్లోనే అందులోని అంశాలను ఆకళింపు చేసుకున్నాడు. పదిమందినిసభ్యులుగా చేర్పించాలని నిబంధన విధించడం, వేలమందికి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టడంతో మోసం బయటపడింది.
ప్రత్యేకంగా విమానమే కొన్నాడు
మల్టీలెవల్ మార్కెటింగ్ ప్రారంభించిన కొత్తలో రాధేశ్యాంకు అనుకున్నంత స్పందన రాలేదు. దీంతో హిస్సార్లో యువతను పోగు చేసి తన కంపెనీ గురించి ప్రచారం చేయించాడు. ఇలా ఏడాదిలో ఐదు లక్షల మంది సభ్యులయ్యారు. ఆ తర్వాత కోట్లలో డబ్బు వచ్చింది. ఖరీదైన కార్లు కొన్నాడు. హిస్సార్ నుంచి ఇతర నగరాలకు వెళ్లేందుకు ప్రత్యేక విమానమూ కొన్నాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసినా ఫ్యూచర్ మేకర్ వెబ్ సైట్ను కొనసాగిస్తున్నాడు. పోలీసులు అతనికి చెందిన ఖాతాల నుంచి డబ్బు జఫ్తు చేసుకున్నారు. హెచ్డీఎఫ్సీ నుంచి రూ.125 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ.56 కోట్లు, బంధన్ బ్యాంక్ నుంచి రూ.20 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.14 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.2 కోట్లు జఫ్తు చేశారు.