ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్: లంబోర్గిని, ఆడి హైఎండ్ కార్లు సీజ్: గంటకు 200 వేగం..జోరుగా రేసింగ్..!
హైదరాబాద్: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ సిరీస్ గురించి తెలియని సినీ ప్రియులు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. నడి రోడ్డు మీద రాకెట్ వేగంతో దూసుకెళ్లే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెడతాయి. ఎప్పుడేం జరుగుతుందోననే హైటెన్షన్ను క్రియేట్ చేస్తాయి. అలాంటి రీల్ సన్నివేశాలే.. రియల్గా కనిపిస్తే ఎలా ఉంటుంది. హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అలాంటి దృశ్యాలే చోటు చేసుకున్నాయి.
Save Amaravati నిరసనల ఎఫెక్ట్: నలుగురు నాగార్జున వర్శిటీ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు..!
గంటకు 200 కిలోమీటర్ల వేగంతో..
ఇద్దరు యువకులు కార్ రేసింగ్కు దిగారు. అత్యంత ఆధునికమైన లంబోర్గిని, ఆడి కార్లతో రేసును నిర్వహించారు. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వాటిని నడిపిస్తూ తోటి వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదులు అందడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. కాపు కాసి మరీ ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. లంబోర్గిని, ఆడి కార్లను స్వాధీనం చేసుకున్నారు.
స్పీడ్ లిమిట్ దాటితే.. అంతే..
ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. ఓవర్ స్పీడింగ్ కింద కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వారి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు వంద కిలోమీటర్లకు మించి ప్రయాణించడానికి అనుమతి లేదు. ఇదివరకు ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ గంటకు 120 కిలోమీటర్లు ఉండేది.
ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ..
వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీన్ని వంద కిలోమీటర్లకు తగ్గించారు. అయినప్పటికీ.. స్పీడ్ లిమిట్ను దాటి వెళ్లే వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. ఫలితంగా- ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్పీడ్ గన్లను అమర్చారు. పెట్రోలింగ్ను కూడా నిర్వహిస్తున్నారు. హైస్పీడ్లో వెళ్లే వాహనాలపై ఫిర్యాదులను చేయడానికి ప్రత్యేక చర్యలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు హైఎండ్ కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
జోరుగా రేసింగ్..
వీకెండ్స్లల్లో హైదరాబాద్లో కార్లు, బైక్ రేసింగ్స్కు కొదవ ఉండదు. పోలీసుల కన్నుగప్పి మరీ రేసింగులకు దిగుతుంటారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి బసవతారకం కేన్సర్ ఆసుపత్రి, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ మీదుగా మళ్లీ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్కు చేరుకోవడంతో ఈ రేస్ ముగిసేది. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం, విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల ఇక నగర శివార్లకు షిఫ్ట్ అయ్యారు రేసర్లు. ఔటర్ రింగ్ రోడ్డును కేంద్రంగా చేసుకుని రేసింగ్లకు పాల్పడుతున్నట్లు తాజా ఉదంతం స్పష్టం చేసింది.