ప్రేమోన్మాది ఘాతుకం: గదికి వెళ్లి యువతిని చంపేశాడు
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గత కొంత కాలంగా ఆమె వెంటపడుతున్న ప్రేమోన్మాది.. మంగళవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్నేహితురాలితో అద్దె ఇంట్లో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) కేపీహెచ్బీలోని డీమార్ట్ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. మూసాపేట హబీబ్నగర్లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలిసి ఉంటోంది.
ప్రేమించాలంటూ వేధింపులు..
కాగా, జానకి పనిస్తున్న సూపర్ మార్కెట్లోనే రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ సమీపంలోని మారెపల్లి గ్రామానికి చెందిన అనంతప్ప అలియాస్ ఆనంద్ కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనను ప్రేమించాలంటూ ఆమెను వేధిస్తున్నాడు.
బెదిరించాడు.. చివరకు
అయితే, ఆనంద్ ప్రేమ ప్రతిపాదనను జానకి తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆమెపై కోపం పెంచుకున్నాడు. పది రోజుల క్రితం జానకి ఇంటికి వెళ్లి తనను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం జానకి గదికి వచ్చిన ఆనంద్.. ఆమెను కత్తితో పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డాడు.
స్నేహితురాలు వచ్చేసరికి..
కాగా, మంగళవారం రాత్రి రూప ఇంటికి వచ్చేసరికి జానకి అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆమె కడుపులో కత్తితో పొడిచిన గాయాలున్నాయి. దీంతో స్థానికులు జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కూకట్పల్లిలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి జానకి మృతి చెందింది. నిందితుడు ఆనంద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు.