రాజీనామా చేయను, ప్లీజ్ సస్పెండ్ చేయండి, చేతకాకుంటే: డీఎస్ ఎదురుదాడి
నిజామాబాద్: తనంతట తాను పార్టీకి రాజీనామా చేసేది లేదని రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు డీ శ్రీనివాస్ మంగళవారం చెప్పారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన తన భవిష్యత్ కార్యాచరణ చెప్పారు. పార్టీని వదిలి వెళ్తే ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుందని, అందుకే తనంతట తాను రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు.
ఓ విధంగా ఆయన ఎదురుదాడికి దికారు. దయచేసి మీరు సస్పెండ్ చేయండని పార్టీ అధిష్టానాన్ని డీఎస్ కోరారు. అదీ మీకు చేతకాకపోతే తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను నమ్ముకొని ఉన్న వారికి అండగా ఉంటానని చెప్పారు. తన వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసునని చెప్పారు.
నా కొడుకులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు
తాను టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేశానని ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకులు పెరిగారని, వారు స్వతంత్రంగా తమ సొంత నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని అభిప్రాయపడ్డారు.
క్రమశిక్షణతో బ్రతికా
ఓ తండ్రిగా తాను ఈ విషయంలో చేసేది ఏదీ లేదని డీఎస్ చెప్పారు. పెరిగిన పిల్లలు స్వతంత్ర్యంగా నిర్ణయం తీసుకోవడం అందరి ఇళ్లలో జరిగేదేనని డీఎస్ అన్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా తాను బతికానని చెప్పారు. తెలంగాణ పట్ల తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు.
మనసులో ఏదో పెట్టుకొని నిరాధార ఆరోపణలు
అసలు తాను ఏ విధమైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. మనసులో ఏదో పెట్టుకొని తమపై నిరాధార ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని వాపోయారు.
ఇష్టం లేకుంటే సస్పెండ్ చేయండి
తాను టీఆర్ఎస్కు నష్టం చేశానని, పార్టీ అధ్యక్షుడికి తీర్మానం పంపారని, తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారని, తద్వారా పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందని చెప్పారని, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం పంపించారని, అలాంటప్పుడు తాను పార్టీని వదిలి వెళ్తే వారు చేసిన ఆరోపణలు నిజం అవుతాయన్నారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకుంటే సస్పెండ్ చేయాలన్నారు.
నా ప్రమేయం లేదని 2సార్లు కేసీఆర్కు చెప్పా
తన కుమారుడు బీజేపీలో చేరడం ఆయన స్వీయ నిర్ణయమని డీఎస్ అన్నారు. అతను బీజేపీలో చేరడంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని తాను ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండుసార్లు చెప్పానని తెలిపారు. తాను ఎప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదన్నారు. అలాగే తన సహచరులను బీజేపీలోకి వెళ్లాలని చెప్పలేదన్నారు.