అక్కడ కమలం ఇక్కడ గులాబీ..! పగలు పద్మాలయా.. రాత్రి శబ్దాలయా.. ఇదీ డీఎస్ పరిస్థితి...!
హైదరాబాద్ : నిజమాబాద్ ఎంపీ బరిలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కూతురు కవితమ్మ ఓటమికి, బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపునకు చక్రం తిప్పిన అపర చాణుక్యుడు ఆయన. కవితమ్మకే కాదు, ఇప్పుడు ఆమె తండ్రి చంద్రశేఖర్ రావు కు కూడా చుక్కలు చూపిస్తున్నారు. పార్టీకి ఎన్నాళ్ల నుంచో దూరంగా ఉంటున్న ఆయన, మొన్నగాక మొన్న.. టీఆర్ఎస్ ఎంపీల సమావేశానికి హాజరయ్యారు, అందరినీ ఆశ్చర్యపరిచారు. దాని నుంచి టీఆర్ఎస్ పెద్దలు తేరుకోక ముందే, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద అమిత్ షాతో సమావేశమయ్యారు. అసలు డీఎస్ ఏం చేస్తున్నారు...? ఏమిటీ రాజకీయం...? చంద్రశేఖర్ రావుకు నిజంగా కొరకరాని కొయ్యగా తయారవుతున్నారా..?
కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న డీఎస్..! అనూహ్యంగా ఆక్టీవ్ ఐన సీనియర్ నేత..!!
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో పీసీసీ చీఫ్ గా అన్నీ తానై వ్యవహరించిన నేత ఆయన. బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన ఈయన అప్పట్లో టీఆర్ఎస్ - కాంగ్రెస్ పొత్తుకు తోడ్పడ్డారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగల సామర్థ్యం ఈయన సొంతం. అయితే తదనంతర కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ కావడంతో చంద్రశేఖర్ రావు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ తో డీఎస్ దోస్తీ చెడింది. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్ రావు కూతురు కవితకు వ్యతిరేకంగా తన అనుచరులు - నాయకులను ఆయన ఉసిగొల్పుతున్నారని గులాబీ ఎమ్మెల్యేలంతా చంద్రశేఖర్ రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు.
తెలంగాణ గులాబీ.. ఢిల్లీలో కమలం..! ద్విపాత్రాభినయం చేస్తున్న డీఎస్..!!
అయితే చంద్రశేఖర్ రావు వ్యూహాత్మకంగా మౌనం వహించి ఆయనను పార్టీకి దూరంగా పెట్టారు. సస్సెండ్ చేస్తే ఆయన రాజ్యసభ సీటులోనే కొనసాగుతారు. ఆయన వేరే పార్టీలో చేరితే అనర్హత వేటు వేద్దామని వేచిచూశారు. అయితే ఇక్కడే తలపండిన డీఎస్ రాజకీయం చేశారు. నిజామాబాద్ లో చంద్రశేఖర్ రావు కూతురు కవిత ఓడిపోయింది. ఈయన కుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం, డీఎస్ ఎప్పుడు వేరే పార్టీ కండువా వేసుకొని కనిపిస్తే అప్పుడు అనర్హత వేటు వేయించాలని కాచుకు కూర్చుంది.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు..! వెంటనే అమీత్ షాతో భేటీ..!!
డీఎస్ మాత్రం తాజాగా నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరగగా దానికి హాజరయ్యారు. ఆ తర్వాత అమిత్ షాను కలిసి చర్చలు జరిపారు. కానీ బీజేపీలో చేరుతున్నట్టు చెప్పలేదు. సీనియరైన డీఎస్ ను పార్టీలోకి తీసుకోవాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరితే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఎసరు వస్తుంది. టీఆర్ఎస్ అనర్హత వేటు వేస్తుంది. అందుకే అటు బీజేపీకి పనిచేస్తూనే ఇటు రాజ్యసభ సీటును వదలకూడదని భావించి డీఎస్ ఢిల్లీలో టీఆర్ ఎస్ సభ్యుడిగానే ఉంటూ బీజేపీ తరుఫున పనిచేస్తున్నారు. తాజాగా అమిత్ షాతోనూ అలాగే భేటి అయ్యారు.
విచిత్రంగా డీఎస్ వ్యవహారం..! ఏమీ చేయలేక పోతున్న కేసీఆర్..!!
ఇలా పదవి పోకుండా.. టీఆర్ఎస్ పనిపడుతూ బీజేపీతో సాన్నిహిత్యం నడుపుతున్న డీఎస్ వ్యవహారశైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి చంద్రశేఖర్ రావు కే చుక్కలు చూపిస్తున్న డీఎస్ ఇప్పుడు బీజేపీకి దగ్గరవ్వడంతో టీఆర్ఎస్ ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది. కానీ, ఆయనను టీఆర్ఎస్ ఏమీ చేయలేదు. ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు... భంగపాటు తప్పితే. ఆయన రాజ్యసభ్య సభ్యత్వ పదవీకాలం పూర్తయ్యేదాకా... ఆ సీటు నుంచి ఆయనను ఎవ్వరూ కదిలించలేరు. అప్పటిదాకా ఆయనను చంద్రశేఖర్ రావు భరించాల్సిందే...! పగలు పద్మాలయా.. రాత్రి శబ్దాలయ అంటే ఇదే మరి..!