సంజయ్ అరెస్ట్: హైకోర్టులో ‘ఏపీ పోలీస్ మాన్యువల్’ అంటూ పిటిషన్ వేసిన డీఎస్
హైదరాబాద్: నర్సింగ్ కళాశాల విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ డీ శ్రీనివాస్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని డీఎస్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
అందువల్ల నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.
నిజామాబాద్లోని ఓ కళాశాలకు చెందిన 11మంది విద్యార్థినులు తమపై సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.