రివర్స్: టీఆర్ఎస్ ఆపరేషన్కు కాంగ్రెస్ ఖల్లాస్! జానాతో వినోద్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే అధికారంలోకి వస్తామని కలలుగన్న కాంగ్రెస్ పార్టీకి గత సార్వత్రిక ఎన్నికల్లో చుక్కెదురయింది. కనీసం 2014లోనైనా అధికారంలోకి వస్తామని బల్లగుద్దీ మరీ చెబుతున్న ఆ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. పెద్ద నేతలు తెరాస వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే డీ శ్రీనివాస్ తెరాసలోకి వెళ్లనున్నారు. ఆయన తర్వాత మరికొంతమంది క్యూలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
డీ శ్రీనివాస్ సోనియా గాంధీకి లేఖ రాశారు. అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన నిజామాబాదులో కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు. గురువారం నాడు మీడియా సమావేశంలో ఆయన అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
డీఎస్ తర్వాత దానం నాగేందర్, నందీశ్వర్ గౌడ్, సుదర్శన్ గౌడ్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎంతో మాజీ ఎంపీ విఠల్ రావు భటీ అయ్యారు. నెల రోజులుగా పార్టీకి మాజీ మంత్రి ముఖేష్ దూరంగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు, జానారెడ్డితో వినోద్ కుమార్ భేటీ చర్చనీయాంశమైంది. పుస్తకావిష్కరణ కోసమే కలిశారని చెబుతున్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
అధికార టీఆర్ఎస్ ఆకర్ష్కు కాంగ్రెస్ సీనియర్లు సరెండరైపోతున్నారని అంటున్నారు. దానం, డీఎస్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీలో రెడ్డి వర్గానికి పెద్ద పీట వేసి, బీసీ వర్గాలను అణదొక్కాలన్న స్ర్టాటజీ ప్రారంభమైందంటూ వీరు చెబుతూ వస్తున్నారు.
ఇలా బీసీలకు స్థానం లేనప్పుడు పార్టీలో ఉండి ప్రయోజనమేమిటన్న భావనతో దానం కూడా డీఎస్ వెంటే టీఆర్ఎస్లో చేరవచ్చునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. మెదక్ జిల్లాలో మరో కీలక బీసీ నేత నందీశ్వర్ గౌడ్ కూడా టీఆర్ఎస్లో చేరుతారన్న వార్తలున్నాయి.
నిజామాబాద్ జిల్లాకే చెందిన మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి కూడా డీఎస్తోపాటు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఎంపీ, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ విఠల్ రావు బుధవారం సీఎంను కలిశారు.
జిల్లా సమస్యలపై కలిసినట్లు చెబుతున్నప్పటికీ ఈయన కూడా టీఆర్ఎస్లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే తనకు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. సీఎం నుంచి ఎలాంటి భరోసా లభించలేదని సమాచారం.
ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నప్పటకీ.. తాను పార్టీ మారేది లేదని ముఖేశ్ చెబుతున్నారు. ఇలా సీనియర్ నేతలంతా పార్టీని వీడడానికి సిద్ధమవుతుండడం మిగిలినవారిలో ఆందోళన కలిగిస్తోంది.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. నలుగురు ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రెడ్యా నాయక్, కాలె యాదయ్య, కనకయ్యతోపాటు కేఆర్ ఆమోస్, యాదవ రెడ్డి, జగదీశ్ రెడ్డి, రాజలింగం వంటి తొమ్మిది మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు డీఎస్ ఉదంతంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడుతోంది.
బొత్స, డీఎస్ లాంటివారు ఈ స్థాయికి వచ్చారంటే కారణం కాంగ్రెస్ కారణమని, ఇద్దరూ పీసీసీ అధ్యక్షులుగా, మంత్రులుగా పని చేశారని, ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారనిస ఇది సరికాదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అయినా సీనియర్ నాయకుడైన డీ శ్రీనివాస్ పార్టీని వీడుతారని తాననుకోవడం లేదన్నారు. కాంగ్రెస్కు ఆయన వీర విధేయుడని, పార్టీ కూడా డీఎస్ సేవలకు తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు.
ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని, పార్టీలోనూ ముఖ్యమైన స్థానాన్ని కట్టబెట్టామన్నారు. ఈసారి మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలన్న పార్టీ విధాన నిర్ణయంలో భాగంగా డీఎస్ నామినేట్ చేసిన మహిళకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చామన్నారు.
ఈసారి మహిళకు అవకాశం ఇస్తున్నామని తాను డీఎస్కు ముందుగానే చెప్పానన్నారు. పార్టీలో తన ఎదుగుదలను దిగ్విజయ్ సింగ్ అడ్డుకుంటున్నారని డీఎస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. డీఎస్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. డీఎస్ పార్టీ వీడేందుకు నేనే కారణమైతే పార్టీ సోనియా తనపై చర్యలు తీసుకుంటారన్నారు.