కేసీఆర్పై గుస్సా: డిఎస్కు పదవులపై ఇంకా వ్యామోహం తగ్గలేదా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్టీ మారారు. అయినా సరే ఆయనకు పదవుల మీద వ్యామోహం ఏ మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. రాజకీయాల్లో ఆయన్ని ఓ కురువృద్ధుడిగా అభివర్ణిస్తుంటారు.
చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకుకొచ్చిన ఘనత తనదేనంటూ చెప్పుకున్నారు. ఇంతకీ సదరు రాజకీయనాయకుడు ఎవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత టీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి సలహాదారుడు ధర్మపురి శ్రీనివాస్ (డి. శ్రీనివాస్).
ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన డి. శ్రీనివాస్ బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుడిగా విధులను నిర్వహిస్తున్నారు. అయితే బాధ్యతలు చేపట్టిన రోజు సెక్రటేరియట్లో కనిపించిన ఆయన ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్పై వేరే పదవి కోసం ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. తన సన్నిహితుల వద్ద తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే సన్నిహితులు మాత్రం ముఖ్యమంత్రి రేంజ్ నీది. నువ్వు ఇలాంటి చిన్న చిన్న పదవులు చేయడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారట.
అయితే అందుకు డి. శ్రీనివాస్ ససేమేరా అంటున్నారని సమాచారం. ఎలాగైనా సరే తనకు ఏదో ఒక పదవి ఇచ్చేలా సీఎం కేసీఆర్పై ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఛైర్మన్ పదవి కాకపోతే త్వరలో రెండు రాజ్యసభ ఎంపీ పదవులు తెలంగాణకు దక్కబోతున్న నేపథ్యంలో అందులో ఒకటి అయినా తనకు కట్టబెట్టాలని అంటున్నారట.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీలోకి చేరిన సందర్భంలో తనకు పదవుల మీద ఎలాంటి మోజు లేనే లేదని, కాంగ్రెసు పార్టీలో అన్ని రకాల పదవులు అనుభవించేశానని, ఇక తాను అనుభవించగలిగిన పదవి అంటూ ఏదీ లేదని చెప్పిన సంగతి తెలిసిందే.