డీఎస్కు షాక్: 3గం.ల విచారణ తర్వాత ధర్మపురి సంజయ్ అరెస్ట్
నిజామాబాద్: రాజ్యసభ సభ్యులు డీ శ్రీనివాస్ తనయుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ఆయన ఆదివారం నిజామాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
ఆయనను సుదీర్ఘంగా మూడు గంటల పాటు విచారించారు. మధ్యలో ఓసారి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత మరోసారి విచారించారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించనున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో అతనిపై నిర్భయ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అతనిని ఏ క్షణమైన పోలీసులు అరెస్టు చేస్తారని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి.
11మంది అమ్మాయిల ఫిర్యాదు: డీ శ్రీనివాస్ తనయుడిపై నిర్భయ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్
కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంజయ్ నిజామాబాద్ ఏసీపీ కార్యాలయంలో న్యాయవాది కృపాకర్ రెడ్డితో కలిసి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని పోలీసులు సంజయ్ ఇంటికి ఈ నెల పదవ తేదీన నోటీసులు అంటించారు. నోటీసుల్లో భాగంగా ఈ రోజు లాయర్తో విచారణకు వచ్చారు. తమను లైంగికంగా వేధిస్తున్నారని శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు సంజయ్పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సంజయ్పై 342, 354, 354A, 506, 509, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. సంజయ్ని ఏసీపీ సుదర్శన్ విచారించారు. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు.