నేను నీలా కాదు, నాకేం సంబంధం: కవితను దులిపేసిన డీఎస్ తనయుడు
నిజామాబాద్: టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై డీ శ్రీనివాస్ తనయుడు, బీజేపీ నాయకులు అరవింద్ గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కవిత కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. డీఎస్ తనను బీజేపీలోకి పంపారన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు.
Recommended Video
డీఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, చర్యలు తీసుకోండి.. రేపు నాపైనా ఇంతే: కేసీఆర్కు కవిత
కవితలా తాను తండ్రి, అన్నలపై ఆధారపడి లేనని కౌంటర్ ఇచ్చారు. మా కుటుంబంలో నాన్న డిక్టెటర్ కాదని, నేను బానిసను కాదని చెప్పారు. రాజకీయాల్లోకి కుటుంబాన్ని తీసుకు రావొద్దన్నారు. రాజకీయంగా ఎదగాలని ఉంటే తాను 2004లోనే ఎదిగేవాడినని చెప్పారు. నాలుగేళ్లుగా నిజామాబాద్లో కవిత చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాను ఎప్పటికీ బీజేపీని వీడనని, ప్రధాని నరేంద్ర మోడీ కోసం ప్రాణం ఇస్తానని చెప్పారు.
ఎవరి రాజకీయం వారిది
రాజకీయాల్లో కుటుంబాల గురించి మాట్లాడకూడదన్న కనీస అవగాహన కవితకు లేకపోవడం దారుణమని అరవింద్ అన్నారు. కుటుంబాలను రాజకీయాల్లోకి లాగడం కవిత అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాజకీయంగా నేను ఎప్పుడు కూడా నాన్న సహాయం తీసుకోలేదన్నారు. ఎవరి రాజకీయం వారిది అన్నారు. తనను నియంత్రించడానికి తన తండ్రి డిక్టేటర్ కాదన్నారు.
వారు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు
ఓ ఫ్యామిలీలో ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటన్నారు. గతంలో సీహెచ్ విద్యాసాగర్ రావు, ఆయన అన్న రాజేశ్వర్రావు ఒకే సమయంలో బీజేపీ, సీపీఐ ఫ్లోర్ లీడర్లుగా పని చేశారని అరవింద్ గుర్తు చేశారు. అలాంటిది తాను, తన తండ్రి వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని అడిగారు. కవిత అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు.
డీఎస్ తీరుపై కేసీఆర్ గుర్రు
కాగా, డీఎస్ పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని పరిణామాలు, పార్టీ శ్రేణుల ఫిర్యాదులు తదితర అంశాల నేపథ్యంలో బుధవారం డీఎస్ను కలవడానికి నిరాకరించారని తెలుస్తోంది. చివరకి డీఎస్ ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా నిరాకరించారని సమాచారం. గురువారం చూద్దామని సీఎంవో అధికారుల ద్వారా సమాచారం వచ్చింది డీఎస్కు.
గురువారం విజయవాడకు కాబట్టి నో
గురువారం కేసీఆర్ కనకదుర్గమ్మ గుడికి వెళ్తారనే విషయం తెలిసిన డీఎస్.. తనను ఆయన కలుస్తారనే నమ్మకం పోయింది. బుధవారం ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు డీఎస్పై ఫిర్యాదు చేస్తూ లేఖను సీఎంకు పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డీఎస్ హైదరాబాద్కు వచ్చారు. నగరంలో ఉన్నానని సీఎం కార్యాలయానికి సమాచారమిచ్చి, కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూశారు. ఆరు గంటలకు పిలుస్తారని భావించారు. కానీ కలవలేదు.