డీ శ్రీనివాస్ కూడా కాంగ్రెస్లోకి!: కొండా ఫ్యామిలీకి సీట్ల కేటాయింపుపై చర్చించలేదని ఉత్తమ్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అసంతృప్తి నేత డి శ్రీనివాస్ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారు. అక్టోబర్ రెండో వారంలో అంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య పార్టీలోకి పునరాగమనం చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారయిందని అంటున్నారు.
ఒక్కటే టిక్కెట్, పరకాలపై మరో షరతు: కొండా సురేఖకు కాంగ్రెస్ షరతు!
సొంత గూటికి డీఎస్
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ముఖ్యనేతలు మాట్లాడుతూ... డీఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే డీఎస్ అని వ్యాఖ్యానించారట. అంతేకాదు, డీఎస్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే గెలుపు అని కూడా ఏఐసీసీ నేతలు వ్యాఖ్యానించారట.
కాంగ్రెస్ను అధికారంలోకి తేవడమే లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ టార్గెట్ అని కొండా దంపతులు తెలిపారు. తాము బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు. తెరాస తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి తమపై అసత్య ప్రచారం చేస్తోందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చాక రాహుల్ గాంధీని మళ్లీ కలుస్తామని చెప్పారు.
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాం
తెరాసలో కేసీఆర్ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి, బీసీ నేతలను ముందుకు రానీయడం లేదని కొండా మురళి అన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెప్పారు. వెనుకబడిన వారి కోసం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. అందుకే తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు.
సీట్ల కేటాయింపుపై చర్చించలేదు
కొండా సురేఖ చేరికతో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ బలపడుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కొండా దంపతులు బేషరతుగానే పార్టీలో చేరారని అన్నారు. వారికి కేటాయించే సీట్లపై ఇంకా చర్చించలేదని చెప్పారు. స్థానిక నేతలతో చర్చించిన తర్వాత సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సురేఖ ప్రచార కమిటీతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారన్నారు.