దగ్గుబాటి అభిరామ్ కారుకు ప్రమాదం... రాయదుర్గంలో కేసు నమోదు...
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ కారు, మరో కారు పరస్పరం ఢీకొన్న ఘటన హైదరాబాద్ మణికొండలో చోటు చేసుకుంది. ఇరువరూ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో అభిరామ్ కారు కంటే అవతలి వ్యక్తి కారు ఎక్కువగా డ్యామేజ్ అయినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు మెకానిక్ లక్ష్మణ్ను తీసుకొని కారు కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వచ్చాడు. మణికొండలో ఓ వ్యక్తి వద్ద బ్రీజా కారు కొనుగోలు చేసి స్నేహితుడు సతీష్తో టెస్ట్ డ్రైవ్కు వెళ్లాడు. ఈ క్రమంలో పంచవటి కాలనీలోని మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వైపు వెళ్లగా... అదే రోడ్డులో నుంచి దగ్గుబాటి అభిరామ్ కారు ఎదురుగా వచ్చింది. దీంతో ప్రమాదవశాత్తు రెండు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు.
ప్రమాద అనంతరం ఇరువరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇద్దరినీ బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించలేదని తేలింది. ఇరువురూ రాంగ్ రూట్లో వచ్చారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో బ్రీజా కారు ఎక్కువగా డ్యామేజీ అయిందన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే తప్పు ఎవరిదన్నది తెలుస్తుందన్నారు.
Recommended Video
కాగా,అగస్టు 8న సినీ నటుడు,దగ్గుబాటి అభిరామ్ సోదరుడు రానా తన ప్రేయసి మిహికా బజాజ్ మూడు ముళ్లతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబాల నుంచి కేవలం 30 మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. మొత్తంగా పెళ్లి తంతు మూడు రోజుల పాటు నిర్వహించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూనే వివాహ వేడుకను నిర్వహించామని రానా తండ్రి,నిర్మాత సురేష్ బాబు తెలిపారు.