రక్తమోడుతున్న రహదారులు.. రాష్ట్రంలో రోజుకు 18 మంది బలి, గతేడాది కన్నా పెరిగిన ప్రమాదాలు ...
హైదరాబాద్ : రెప్పపాటులో ప్రమాదం ఆయా కుటుంబాలను కబళిస్తోంది. క్షణకాలంలో జరిగే ప్రమాదం కుటుంబ సభ్యులకు తీరని నష్టం కలిగిస్తోంది. 2015 నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తోన్నాయి. ప్రతీ ఏటా మృతుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అతి వేగం, డ్రైవింగ్లో నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి .. రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నాయి.
రక్తమోడిన రహదారులు
2015లో లక్షా యాభైవేల రోడ్డు ప్రమాదాలు జరిగాయని ఓ సర్వే సంస్థ కఠోర నిజాన్ని తెలిపింది. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మందికిపైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 3,833 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. 13,588 మంది గాయపడ్డారు. వారిలో కొందరు కాళ్లు, చేతులు విరిగి నరకం అనుభవిస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో రోజుకు 18 మంది, నెలకు 479 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రతీ రోజు 64 మంది గాయపడ్డారు. అంటే ప్రతీ 93 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు.
ఎక్కువ ప్రమాదాలు
హైదరాబాద్లో ఐటీ హబ్ విస్తరించింది సైబరాబాద్లోనే.. ఐటీతోపాటు రోడ్డు ప్రమాదాల్లో కూడా సైబరాబాద్ కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచింది. కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 467 మంది చనిపోయారు. రాచకొండ 427 మంది, సంగారెడ్డి 259, వరంగల్ 197, నల్గొండ 188, ఖమ్మం 166. సిద్దిపేట 165 మంది చనిపోయారు. ములుగు, నారాయణపేట్ జిల్లాలు 3 మరణాలతో అత్యల్ప ప్రమాద మృతులు నమోదైన జిల్లాల జాబితాలో చేరాయి. తర్వాత వనపర్తి 46, సిరిసిల్ల 41, కుమ్రంభీం 34 మందితో తర్వాతి స్థానంలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 1,032 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మం నిలిచాయి.
పెరుగుతున్న ప్రమాదాలు
గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 6,603 మంది చనిపోగా . 23 వేల 613 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 6 వరకు అదీ 3 వేల 833కి చేరింది. గతేడాది కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. క్షతగాత్రుల సంఖ్య కూడా 11 వేల 933కి చేరింది. గతేడాది కన్నా ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకోసం వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకపోయింది. ప్రమాదాల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు.