రోజుకు 3 గంటలు: వైన్ షాపులు తెరిచేందుకు అనుమతివ్వండి, లిక్కర్ వ్యాపారుల వినతి...?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధి గురించి అయితే చెప్పక్కర్లేదు. మెజార్టీ కేసులు ఇక్కడే ఉండటంతో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ఊహాగానాలు నెలకొన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ తమకు కూడా సడలింపులు ఇవ్వాలని లిక్కర్ వ్యాపారులు కోరుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలు షాపు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవేళ లాక్డౌన్ విధిస్తే.. పాలు, కూరగాయాలు, మందుల షాపు, బియ్యం షాపు, కిరాణా షాపులకు అనుమతి ఉంటుంది. ఉదయం పూట కొన్ని గంటలు అనుమతిస్తారు. అయితే వారి లాగే తమకు కూడా పర్మిషన్ ఇవ్వాలని లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్, వైన్ షాప్ యజమానులు కోరుతున్నారు. రోజుకు మూడు గంటలపాటు వైన్స్ షాపు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేదంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ వల్ల వైన్ విక్రయాలు పడిపోయాయని చెప్పారు. బీర్ల విక్రయాలు సరిగా లేదు అని, లిక్కర్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పారు. లాక్ డౌన్ వల్ల నెలన్నర రోజులు వైన్స్ మూసివేశామని.. దీంతో తమకు నష్టాలు వాటిల్లాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం లైసెన్స్ ఫీజు మాత్రం తగ్గించలేదు అని చెప్పారు. వైన్ షాపులు 3 గంటల పాటు తెరిచేందుకు అనుమతి ఇస్తే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టంచేశారు. భౌతికదూరం పాటిస్తూ.. విక్రయాలు జరుపుతామని హామీనిచ్చారు.