అచ్చం ప్రేమిస్తే సినిమాలా: కులాంతర వివాహంపై పెద్దల కన్నెర్ర, డీఎస్పీకి హెచ్ఆర్సీ నోటీసులు..
ప్రేమ వివాహాలకు పెద్దలు సుతారము అంగీకరించరు. ఇదీ జగమెరిగిన సత్యం. ఇక అగ్రకులమైతే అంతే సంగతులు. కానీ ఇక్కడ.. అగ్రకులానికి చెందిన యువతికి పేరంట్స్కు పోలీసులు అప్పగించారని ఓ దళిత యువకుడు వాపోతున్నాడు. అంతేకాదు తన ప్రాణానికి ముప్పు ఉంది అని.. కాపాడాలని వేడుకుంటున్నాడు. అతను మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించగా.. సదరు పోలీసులకు హెచ్ఆర్సీ నోటీసులు జారీచేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.
ఆమెకు 17, అతనికి 29: 12 ఏళ్ల తేడా.. ప్రేమ, పెళ్లి వద్దన్నందుకు అతని గదిలోనే ఆత్మహత్య..?
ప్రేమ పెళ్లి... 3 రోజులకే
నల్గొండ జిల్లాకు చెందిన నాగార్జున్ ఉస్మానియా వర్సిటీలో రీసెర్చ్ స్కాలర్. ఇతను దళితుడు కాగా.. అదే జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ గత నెల 24వ తేదీన సూర్యాపేటలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి పెళ్లి.. యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. పెళ్లైన తర్వాత వీరిద్దరూ అనాజీపురం గ్రామంలో ఉంటున్నారు. అయితే యువకుడికి మాత్రం బెదిరింపులు తప్పడం లేదు. ఈ క్రమంలో గత నెల 27వ తేదీన వారు ఉన్న ఇంటి వద్దకు రావడంతో... చంపడానికి ప్రయత్నిస్తున్నారని అనుకొన్నారు. వెంటనే అక్కడినుంచి పారిపోయి.. సూర్యాపేట డీఎస్పీని తమకు రక్షణ ఇవ్వాలని కోరారు.
యువతి పేరంట్స్ ప్రలోభాలు..?
అక్కడినుంచి సీన్ రివర్సయ్యింది. యువతీ పేరంట్స్ పోలీసులను ప్రభావితం చేశారని నాగార్జున ఆరోపిస్తున్నారు. కేసును నల్గొండ షీ టీమ్కు బదిలీ చేశారు. అక్కడికి యువతి పేరంట్స్ కూడా వచ్చారు. దీంతో నాగార్జునకు మరింత అనుమానం వచ్చింది. అనుకున్నట్టు గుర్రంపోడు పోలీసుస్టేషన్ నుంచి వాహనంలో తీసుకెళ్లారు. ఈ సమయంలో యువతి బంధువులు కారులో ఉండగా.. ఎస్పై సైదులు, కానిస్టేబుల్ చిన్నబాబు ప్రోద్బలంతో నాగార్జునను దూషించారు. వారు తాము కలిసి ఉండటాన్ని అంగీకరించబోరు అని నాగార్జునకు అర్థమైపోయింది.
మందు తాగాలని బెదిరింపులు
కారులో యువతి బంధువు రెచ్చిపోయాడు. తక్కువ కులమైన.. నీకు మా అమ్మాయి కావాలా అని దూషించారు. విడాకులు తీసుకోవాలని బెదరించారు. యువతి బావ బలవంతంగా మందు తాగించే ప్రయత్నం చేశాడు. కానీ నిరాకరించడంతో.. తనను దూషించాడని నాగార్జున చెప్పారు. మధ్యాహ్నాం 1 గంటలకు కారు గుర్రంపోడు పోలీసు స్టేషన్కు చేరుకుంది. ఇద్దరినీ పోలీసులు మూడు గంటలపాటు చేయి చేసుకున్నారని తెలిపారు. అందుకు అంగీకరించకపోవడంతో.. చివరికి తన భార్యను తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారని చెప్పారు. కానీ తన పేరంట్స్కు సాయంత్రం 4.30 గంటలకు సమాచారం ఇస్తే.. రాత్రి 10 గంటలకు వారు వచ్చారని తెలిపారు.
హైకోర్టు టు హెచ్ఆర్సీ
తన భార్యను పేరంట్స్కు పోలీసులు అప్పగించారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఘటనపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక సమర్పించాలని నల్గొండ డీఎస్పీని ఆదేశించింది. కానీ ఇప్పటికీ కూడా తన భార్య వారి పేరంట్స్ ఆధీనంలో ఉంది అని యువకుడు ఆరోపించారు. గత 12 రోజుల నుంచి తన భార్య దూరంగా ఉంది అని.. తన ప్రాణానికి ముప్పు ఉంది అని నాగార్జున ఆందోళన చెందాడు. వారి భయానికి ఊరిలో ఉండటం లేదు అని.. స్నేహితుల వద్ద ఉంటున్నానని చెప్పారు.
యువతి కంప్లైంట్
ఘటనపై నల్గొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి స్పందించారు. హెచ్ ఆర్సీ నోటీసు తన దృష్టికి వచ్చిందని.. కానీ ఇంకా పత్రాలను అందుకోలేదని చెప్పారు. యువతి ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ పోలీసుల తీరుపై స్పందించేందుకు మాత్రం నిరాకరించారు.