రోహిత్ ఆత్మహత్యపై బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా, 'చంద్రబాబు మాట్లాడరేం'
ముంబై/హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటన పైన బాలీవుడ్ దర్శకుడు ప్రకాశ్ ఝా స్పందించాడు. రోహిత్ ఆత్మహత్య బాధాకరమని ఆయన అన్నారు. జీవించి ఉండటం కంటే చనిపోవడమే మేలని రోహిత్ భావించి ఉంటాడని ఆవేదన వ్యక్తం చేశారు.
అతను ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పిన కారణాలు ఏమిటో గుర్తించాలన్నారు. అది చాలా దారుణమన్నారు. ఇలాంటివి సరికాదని అభిప్రాయపడ్డారు.
హెచ్సియు విద్యార్థులకు సిపిఐ నేతల సంఘీభావం
వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వారికి సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, రాజా తదితరులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఏబీవీపీ విశ్వవిద్యాలయాల్లో గూండాయిజం నడుపుతోందని సురవరం ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చెబుతున్నారన్నారు.
కేంద్ర మానవవనరుల శాఖ నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడుల వల్లనే వేముల రోహిత్, మిగతా నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. వేముల రోహిత్ ఆత్మహత్య పైన నిష్పక్షపాత ధర్యాప్తు జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు.
టిడిపి మౌనం ఎందుకు: మేరుగ నాగార్జున
రోహిత్ ఆత్మహత్య పైన ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గం మౌనంగా ఎందుకు ఉందని వైసిపి ఎస్సీ సెల్ చైర్మన్ మేరుగ నాగార్జున ప్రశ్నించారు. ఇంతటి తీవ్ర సంఘటన పైన టిడిపి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.