వన్ఇండియాతో రోహిత్ సోదరుడు: ఆత్మహత్యపై వివరణ కోరిన రాజా వేముల
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి రోహిత్ వేముల కుటుంబసభ్యులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకున్నా తమ కుటుంబాన్ని ఓదార్చేందుకు విశ్వవిద్యాలయం నుంచి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంటున్నారు.
పీహెచ్డీ స్కాలర్ చేస్తున్న రోహిత్ వేములను ఇటీవల ఆ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్ రెండ్రోజుల క్రితం యూనివర్సిటీ హాస్టల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సోదరుడి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాజా వేముల.. యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అతడు మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదని, మేము కూడా అతడ్ని కలవాలని అనుకోవడం లేదని చెప్పారు. వైస్ ఛాన్స్లర్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తాను, తన తల్లి, కొందరు బంధువులతో పాటు వీసీ ప్రొఫెసర్ పొదిలె అప్పారావును కలిసేందుకు ప్రయత్నించామని తెలిపారు.
యూనివర్సిటీ అధికారులు ఎవ్వరూ కూడా రోహిత్ సస్పెన్షన్ విషయాన్ని తమకు చెప్పలేదని రాజా వేములు చెప్పారు. రోహిత్ ఆత్మహత్యపై వాస్తవాలు తమకు తెలియాలని ఆయన అన్నారు. ఇప్పటికీ వీసీ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
పారదర్శకంగా విచారణ జరగాలి
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తోపాటు మరో నలుగురిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తమకు రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని వారు తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలని కోరారు.
హెచ్సీయూ వీసీ, బిజెపి ఎమ్మెల్సీ రామచంద్ర రావు, ఇతరులపై కూడా కేసు నమోదైంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనకు దిగిన దళిత విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి ఓ లేఖ రాసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, తాను ఎవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని బండారు దత్తాత్రేయ చెప్పారు.