ఎవరీ కంచ ఐలయ్య?: వివాదాల చట్రంలోకి ఎలా వచ్చారు..
బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయి వాదోపవాదనలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
హైదరాబాద్: సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారి తీసింది. ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి పుస్తకంపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో.. దీనిపై చర్చ ప్రాధాన్యతను సంతరించుకుంది.
బహుజనవాదులు, వైశ్య మద్దతుదారులు స్పష్టంగా చీలిపోయి వాదోపవాదనలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పుస్తకం శీర్షిక పైనే ప్రధాన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైశ్యులు.. దాన్ని నిఫేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
'సామాజిక స్మగ్లర్లు' పుస్తకంపై భగ్గుమన్న వైశ్యులు: ఎవరినీ విమర్శించలేదన్న ఐలయ్య..
ఈ నేపథ్యంలో అసలు కంచ ఐలయ్య ఎవరు?, వివాదాల చట్రంలోకి ఆయన లాగబడ్డారా?.. తన అభిప్రాయాలకు స్వేచ్చనిచ్చే స్పేస్ ఈ సమాజంలో కొరవడిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఐలయ్య నేపథ్యం:
ఐలయ్య 1952, అక్టోబరు 5న వరంగల్ జిల్లాలోని పాపన్నపేట గ్రామంలో గొల్ల కురుమ కుటుంబంలో జన్మించారు. ఐలయ్య కుటుంబం గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగించేది. చిన్నతనంలో విద్యాభ్యాసం అంతా అక్కడే కొనసాగింది. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చేరారు.
గౌతమబుద్ధుని రాజకీయ తత్త్వం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో డాక్టరేటు పొందారు. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. మౌలానా ఆజాద్ యూనివర్సిటీలోను ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం టీమాస్ మేదావుల ఫోరంలో సభ్యులుగా ఉన్నారు.
ఐలయ్య రచనలు:
ప్రొఫెసర్గా, రచయితగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన కంచ ఐలయ్య తొలి నుంచి బహుజనవాదాన్ని బలంగా భుజానికెత్తుకున్న వ్యక్తి. అంబేడ్కర్, మార్క్స్ సిద్దాంతాలను బలంగా విశ్వసిస్తూ తనవంతుగా వాటిని వ్యాప్తిలోకి తీసుకురావడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక రచనలు చేశారు.
ఐలయ్య రాసిన 'నేనెట్ల హిందువునైత?' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లోను పరిశోధనాత్మక పుస్తకంగా మారింది. దేశంలో ఉన్న చరిత్ర గ్రంథాలు, పురాణేతిహాసాలన్ని అగ్ర కులాల పక్షం వహించగా.. ఐలయ్య రాసిన పుస్తకాల్లో స్పష్టమైన బహుజన సాంస్కృతిక తాత్వికత కనిపిస్తుంది. హిందూమతానంతర భారతదేశం, దేవుడిపై బుద్దుడి తిరుగుబాటు, అంటరాని దేవుడు వంటి పుస్తకాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ పుస్తకాలు సహజంగానే అగ్ర కులాల వైపు నుంచి తీవ్ర విమర్శను ఎదుర్కొన్నాయి.
అప్పటి కమిటీలో సభ్యులు:
తొలినాళ్లలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) తరుపున కూడా ఐలయ్య పనిచేశారు.
2007లో ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్ల అంశంపై వీరప్ప మొయిలీ నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక పర్యవేక్షణ కమిటీని వేశారు. ఆ కమిటీలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య కూడా ఒకరు. ఆ సమయంలో ప్రైవేటు వర్తక వాణిజ్యంలో ఎక్కువగా ఉన్నది వైశ్యులే కాబట్టి.. ప్రైవేటు సెక్టారులో రిజర్వేషన్లను వాళ్లు వ్యతిరేకించారని కంచ ఐలయ్య చెబుతున్నారు. తాజా పుస్తకం 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంలోను ఈ విషయం ప్రస్ఫుటమైంది.
తెలంగాణ ఉద్యమానికి దూరం:
తెలంగాణ ఉద్యమాన్ని ప్రొఫెసర్ కంచ ఐలయ్య వ్యతిరేకించారు. రాష్ట్రం విడిపోతే భూస్వామ్య వర్గాలు మళ్లీ బలం పుంజుకుంటాయని, దానివల్ల తాడిత, పీడిత కులాలు మరింత నష్టపోతాయని ఆయన హెచ్చరించారు.
శ్రమ శక్తికి గౌరవం దక్కలేదని:
ఉత్పత్తి కులాల శ్రమ పునాదిగా అగ్ర వర్ణాలు అభివృద్దిలోకి రావడాన్ని.. ఉత్పత్తిదారుడు మాత్రం అదే పేదరికంలో, అదే అసమ విలువలతో బతుకీడుస్తుండటాన్ని కంచ ఐలయ్య మొదటి నుంచి తన రచనల ద్వారా చాటుతున్నారు.
అనాదిగా ఈ దేశానికి సేవ చేస్తున్న అణగారిన కులాలే ఈ దేశానికి మొట్టమొదటి సైంటిస్టులు, ఇంజనీర్లు అని తన రచనల ద్వారా శాస్త్రీయంగా నిరూపించగలిగారు. ఈ క్రమంలోనే మాదిగ తత్వం, మాలల తత్వం, 'అజ్ఞాత ఇంజనీర్లు-కుమ్మరి, కమ్మరి, కంసాలి, గౌండ్ల', బహుజన స్త్రీవాదులు-చాకలోళ్లు, సామాజిక వైద్యులు-మంగలోళ్లు, ఆధ్యాత్మిక ఫాసిస్టులు-బ్రాహ్మణులు, సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు వంటి పుస్తకాలను ఆయన వెలువరించారు.
తీవ్రమైన విమర్శలు:
ఈ దేశ శ్రమ జీవుల చరిత్ర, వారి నైపుణ్యాలు ఇక్కడి పాఠ్య పుస్తకాల్లో నమోదుకాకపోవడంపై ఆయనకు తీవ్రమైన అభ్యంతరాలున్నాయి. అసలైన శాస్త్రీయతను పక్కనపెట్టి, కేవలం భావవాద పూరితమైన కథలు, పద్యాలతో సమాజాన్ని పురోగతి చెందించలేమని ఆయన వాదిస్తున్నారు.
అలా తన రచనలు, ప్రసంగాల విషయంలో కంచ ఐలయ్య.. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆర్యవైశ్యుల నుంచి అదే వ్యతిరేకతను చవిచూస్తున్నారు. అయితే దళిత బహుజనులు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న అవమానాలు, ఛీత్కారాలు, మనుస్మృతి గ్రంథాల్లో వారి కించపరిచిన తీరు ఇక్కడ విస్మరణకు గురవుతుండటం సమాజంలోని వైరుధ్యాలను స్పష్టంగా ఎత్తి చూపుతోంది.