బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ దళిత సభ త్వరలోనే: కేసీఆర్, వివిధ రాష్ట్రాల నేతల భేటీ
హైదరాబాద్: త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో భారీ దళిత సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ తోపాటు పలువురు నేతలు బీఆర్ఎస్ ఏర్పాటుపై కేసీఆర్కు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న దళిత సోదరులతో హైదరాబాద్లో దళిత్ సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు.
ఎస్సీల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి తిరుమావళన్ అడిగి తెలుసుకున్నారు. ఎస్సీలకు ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావట్లేదని, తెలంగాణలో అమలవుతోన్న దళితబంధు గొప్ప పథకమని ఆయన ప్రశంసించారు.
దసర పండగ సందర్భంగా బుధవారం రోజున జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొదట దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేస్తామని, ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్లు సంకేతాలిచ్చారు. గురువారం ఎన్నికల సంఘానికి పార్టీ పేరు మార్పుపై, జాతీయ పార్టీగా మారడంపై చేసిన తీర్మానాన్ని సమర్పించింది తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలోనే సభ్యుల బృందం. మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బరిలోకి దిగుతారని చెప్పారు.