కాంగ్రెస్కు షాక్: రేపే టీఆర్ఎస్లోకి దామోదర్ రెడ్డి!, పనిచేయని డీకే అరుణ బుజ్జగింపు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పబోతున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
భయపడను, లావుగా ఉంటే బలమైన నేత కాదు: నాగంపై డీకే అరుణ, దామోదర్కు బుజ్జగింపు
దామోదర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీకి దామోదర్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్ధన్ రెడ్డి చేరికను దామోదర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
బహిరంగ విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనికి కలిసి నాగం చేరికపై దామోదర్ రెడ్డి చర్చించినట్లు కూడా ప్రచారం జరిగింది. తాను ఎంతగా వ్యతిరేకించినా కాంగ్రెస్ నాగంను పార్టీలోకి చేర్చుకోవడంపై దామోదర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
తన అభ్యంతరాలను పార్టీ పట్టించుకోలేదని, తన మాటకు విలువ ఇవ్వడం లేదని దామోదర్ రెడ్డి మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా, దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించేందుకు మాజీ మంత్రి డీకే అరుణ ప్రయత్నాలు కూడా విఫలమైనట్లు తెలుస్తోంది.