సుఖపడేందుకు టీఆర్ఎస్లో చేరలేదు: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన దానం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు గులాబీ కండువాను కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ పునర్ నిర్మాణం యజ్ఞంలా సాగుతోందన్నారు. మా దుష్మన్లు (రాజకీయ ప్రత్యర్థులు) గట్టిగా లేరన్నారు.
Recommended Video
మా వాళ్లు మొద్దుబారిపోతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పథకాలు రాజకీయం కోసం చేసింది కాదన్నారు. నాలుగేళ్లలో మనకు ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. మనం నిబద్దతతో పని చేయడం వల్ల అవార్డులు వచ్చాయన్నారు. మాటలు చెబితే అవార్డులు రావన్నారు. మానవీయ కోణంలో పాలన సాగుతోందన్నారు.
దానం నాగేందర్ తెరాసలో చేరుకోంది సుఖపడేందుకు కాదని, పెద్ద బండ ఎత్తుకునేందుకు వచ్చారని కేసీఆర్ చెప్పారు. దానం తెరాసలో చేరి పని చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఆయన ప్రజల నుంచి వచ్చారని, ప్రజలకు నాయకత్వం వహిస్తారన్నారు. అన్ని పార్టీల రాజకీయంలా తమది కాదన్నారు. ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఉందని చెప్పారు. పేదల ఆర్తి నుంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మి అన్నారు. అగ్రకులాల్లోని పేదలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నామని చెప్పారు.
టీఆర్ఎస్లో మరో ఇరవై మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. మేథావులు అనుకున్న సమైక్యాంధ్ర వాళ్లు 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యమంత్రికి దమ్ము ఉందా అని బీజేపీ వాళ్లు అంటున్న దిక్కుమాలిన దమ్మేమిటి అని నిలదీశారు. ఇక్కడ బీజేపీకి ఎంత దమ్ము ఉందో మనకు తెలియదా అన్నారు. అమిత్ షా వచ్చి అడ్డం, పొడుగు మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.