చాలామంది ఉన్నారు: కోల్ స్కాంపై దాసరి, పవన్ కళ్యాణ్పై..
హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో తనపైన అనవసరంగా బురద చల్లుతున్నారని, అది సరికాదని మాజీ కేంద్రమంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు అన్నారు. తాను ఈ బొగ్గు కుంభకోణం నుంచి 200 శాతం బయటపడతాననే విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంలో చాలామంది ప్రముఖులు ఉన్నారని ఆయన చెప్పారు. ఆ సమయంలో తాను సహాయ మంత్రిగానే ఉన్నానని, నిర్ణయాధికారం ప్రధానమంత్రి కార్యాలయానిదేనని ఆయన చెప్పారు. తన పైన వచ్చిన ఆరోపణలకు తాను చాలా బాధపడ్డానని తెలిపారు.
కాగా, బొగ్గు కుంభకోణంలో మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణ రావుకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం నాడు షాక్ తగిలిన విషయం తెలిసిందే. బొగ్గు కుంభకోణంపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
నవీన్ జిందాల్, దాసరి నారాయణ రావు, మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మాజీ కోల్ సెక్రటరీ హెచ్సీ గుప్తాలపై అభియోగాలు నమోదు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. యూపీఏ ప్రభుత్వ హాయంలో బొగ్గు కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే.
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి దాసరి మాట్లాడుతూ... ఆయన మానవతావాది అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో నష్టాలు వచ్చిన బయ్యర్స్ను ఆదుకునేందుకు స్వచ్చంధంగా ముందుకు వచ్చారని చెప్పారు. గతంలోను ఇలా చేశారని చెప్పారు. ఆయన మానవతా వాది అని, అందుకే ఆయన గ్రేట్ అన్నారు.
తాను పవన్ కళ్యాణ్ విషయమై తాను ఎప్పుడు గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ పదాలు ఉపయోగించలేదన్నారు. పవన్ కళ్యాణ్ గ్రేట్ అని చెప్పానని తెలిపారు. కాగా, పవన్ కళ్యాణ్ తన సినిమాను అంగీకరించినందువల్లే ఆయనను తాను గ్రేట్ అనలేదని, మానవతావాది కాబట్టి చెప్పానన్నారు.