రామోజీ ఈనాడును సవాల్ చేసిన దాసరి ఉదయం డైలీ
దాసరి నారాయణ రావు తెచ్చిన ఉదయం డైలీ తెలుగు పత్రికా రంగంలో ఓ సంచలనం. అది తెలుగు పత్రికారంగానికి యువరక్తాన్ని పరిచయం చేసింది.
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు తెలుగులో ప్రారంభించిన ఉదయం డైలీ పత్రికా రంగంలో ఓ సంచలనం. తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ పత్రిక వచ్చే వరకు రామోజీ రావు ఈనాడు దినపత్రికదే ఆధిపత్యం.
చదవండి: దాసరి మృతి: వెక్కివెక్కి ఏడ్చిన మోహన్ బాబు
ఈనాడు దినపత్రికను ఉదయం డైలీ సవాల్ చేసింది. రోజువారీ పత్రిను వెలువరించడంలో ఆర్థికపరమైన, ఇతరమైన ఒడిదొడుకులు చాలా ఉండేవి. అయినప్పటికీ ఆ పత్రిక ఈనాడుకు ధీటుగా, ఒక రకంగా ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చింది. పత్రిక కోసం జిల్లాల్లో పాఠకులు ఎదురు చూస్తూ ఉండేవారు.
జిల్లాలోని పాఠకులకు ఆ పత్రిక మధ్యాహ్నం 12 గంటలకు చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా పత్రికను ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. పత్రికారంగంలో అది పెట్టిన ఒరవడి అది. ఆ ఒరవడికి ప్రధాన కారణం అది ప్రజల పక్షాన నిలబడడమే.
ప్రారంభం ఇలా...
ఉదయం దినపత్రికను ఆయన 1984లో ప్రారంభించారు. తారకప్రభు పబ్లికేషన్ తరఫున అది ప్రచురితమయ్యేది. దానికి చైర్మన్గా దాసరి నారాయణ రావు, మేనేజింగ్ డైరెక్టర్గా రామకృష్ణ ప్రసాద్ వ్యవహరించారు. ఎబికె ప్రసాద్ సంపాదకత్వంలో అది వెలువడింది. ఆ తర్వాత కెఎన్వై పతంజలి, కె రామచంద్రమూర్తి సంపాదకులుగా వ్యవహరించారు. 1991లో దాన్ని మాగుంట సుబ్బిరామిరెడ్డి కొనుగోలు చేశారు.
పత్రికారంగంలోకి కొత్త రక్తం....
ఉదయం దినపత్రిక ద్వారా యువరక్తం పత్రికారంగంలోకి అడుగు పెట్టింది. ఈ పత్రికలో చేరిన చాలా మంది తెలంగాణకు చెందిన యువకులు కావడం విశేషం. ఉన్నత విద్యలు అభ్యసించిన మొదటి తరం లేదా రెండో తరం ఉదయం పత్రిక ద్వారా పత్రికారంగంలోకి వచ్చింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడిగా ఉన్న కె. శ్రీనివాస్, సాక్షి పత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి, సాహిత్య రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్న అంబటి సురేంద్ర రాజు వంటివారు ఉదయం దినపత్రికలో పనిచేశారు. సెంట్రల్ ఇన్పర్మేషన్ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఈ పత్రికలో పలు సంచలనాత్మక, పరిశోధనాత్మక వార్తాకథనాలు రాశారు. దేపులపల్లి అమర్, పాశం యాదగిరి వంటివారు ఈ పత్రికలో పనిచేశారు.
ఆదరణకు కారణం....
తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రబలంగా ఉన్న కాలంలో ఉదయం దినపత్రిక వచ్చింది. అది ప్రజా ఉద్యమాలకు బాసటగా నిలబడుతూ వచ్చింది. ప్రభుత్వాలకు సవాల్గా కూడా నిలిచింది. ప్రజల పక్షాన నిలబడిన చరిత్ర ఉదయం దినపత్రికది. దాంతో ప్రజలు ఉదయం దినపత్రికను అక్కున చేర్చుకున్నారు.
జర్నలిస్టులకు స్వేచ్ఛ..
దాసరి నారాయణ రావు పత్రికలో ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు. ఇది రాయాలని, అది రాయకూడదని చెప్పిన సందర్భాలు లేవనే చెప్పాలి. జర్నలిస్టులకు నిజమైన స్వేచ్ఛ ఉండేది. యాజమాన్యాలకు కాకుండా పత్రికా రచయితలకు స్వేచ్ఛ ఉండేదనడానికి ఉదయం పత్రికలో వచ్చిన కథనాలే నిదర్శనం. దాంతో ప్రగతిశీల భావాలను పుుణికి పుచ్చుకుని పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన యువకులు ప్రజల పక్షాన నిలబడి వార్తాకథనాలు రాసేవారు. వార్తలను తొక్కిపెట్టడం అనేది చూడని రోజులు అవి. అయితే, దాసరి నారాయణ రావు ఇచ్చిన స్వేచ్ఛను ఉదయం దినపత్రికలో విశృంఖలతకు దారి తీయకపోవడం ఆ పత్రికలో పనచేసిన జర్నలిస్టుల నిబద్ధత, నిజాయితీ. దాన్ని దాసరి నారాయణ రావు ప్రోత్సహించారు.
కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూ
నక్సలైట్ ఉద్యమం ప్రబలంగా ఉన్న కాలంలో అప్పటి పీపుల్స్వార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కొండపల్లి సీతారామయ్య ఇంటర్వ్యూను ఉదయం దినపత్రిక ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూ ప్రచురితం కావడానికి ప్రధానంగా దాసరినారాయణ రావుకు పత్రికారంగం పట్లనే కాకుండా జర్నలిస్టులకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ పట్ల గౌరవం ఉండడమే కారణమని చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ అప్పట్లో తీవ్రమైన సంచలనం సృష్టించింది.
శివరంజని పత్రిక....
ఉదయం దినపత్రిక ప్రజల్లోకి దూసుకుని వెళ్తున్న సమయంలోనే ఆయన శివరంజని అనే సినిమా పత్రికను ప్రారంభించారు. తాను నిర్మించి, దర్శకత్వం వహించిన శివరంజని సినిమా సూపర్ హిట్ అయింది. ఆ పేరుతోనే ఆయన సినిమా పత్రికను ప్రారంభించారు. ఆ తర్వాత ఉదయం వీక్లీని కూడా ప్రారంభించారు. ఈ పత్రికల్లో దేవీప్రియ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, అల్లాణి శ్రీధర్ వంటివాళ్లు పనిచేశారు. పత్రికా సంపాదకులకు ఆయన ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఉదయం వీక్లీ ద్వారా వినూత్నమైన రచనలు వెలుగులోకి వచ్చాయి. కొత్త రచయితలు వెలుగు చూశారు. ఉదయం డైలీలో వచ్చిన సాహిత్యం స్పెషల్ కూడా విశేషమైన ఆదరణ పొందింది.
స్పెషల్స్ ఉదయంతోనే...
తెలుగు వార్తా పత్రికల్లో క్రీడలకు ఒక పేజీ కేటాయించడం ఉదయం తోనే ప్రారంభమైంది. దానికి ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యతగా పేరు ప్రఖ్యాతులు గడించిన సిహెచ్ వెంకటేష్ ఇంచార్జీగా ఉండేవారు. "నీ పేజీకి మంచి ఫాలోయింగ్ ఉందయ్యా" అంటూ ఆయన భుజం తట్టి అభినందించడం ఎప్పటికీ గుర్తుంటుందని ఆయన గుర్తు చేసుకుని దాసరికి అశ్రు నివాళులు అర్పించారు. చెప్పాలంటే, ఒక్కో రంగానికి ఒక్కో స్పెషల్ పేజీ ప్రారంభమైంది ఉదయం దినపత్రికతోనే అని చెప్పాలి.