కిరణ్ పాలనా ఇంత దుర్మార్గంగా లేదు: దాసోజు శ్రవణ్, కెసిఆర్పై పొన్నాల ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధికార ప్రతనిధి దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తోందని ఆరోపించారు. విత్తనాల కంపెనీ అధినేత భూములను కాపాడేందుకే.. తోటపల్లి ప్రాజెక్టును రద్దు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడాన్ని శ్రవణ్ ఆక్షేపించారు.
కెసిఆర్ ప్రభుత్వం సాంస్కృతిక వారధిలో ఉద్యోగాలు దక్కని దగాపడ్డ కళాకారుల గొంతునొక్కుతోందని ఆరోపించారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసుకున్న ధూంధాంకు అనుమతి రద్దు చేసి వారిని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.
పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా కాకుండా పింక్ పార్టీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దగాపడ్డ కళాకారుల ధూంధాం సభకు అనుమతి ఎందుకు రద్దు చేశారో డిజిపి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజయ్యను ఎందుకు బర్తరఫ్ చేశారో కెసిఆర్ చెప్పాలి: పొన్నాల
వరంగల్: మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను మంత్రి వర్గం నుంచి ఎందుకు భర్తరఫ్ చేశారో ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పాలని టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ అహంకార పూరిత ధోరణి వల్లే వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందన్నారు.
ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని, ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి భయం లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరువు పరిస్థితులేర్పడ్డాయని, కరువు నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని ఆయన విమర్శించారు.