ఆ ఘనత కేసీఆర్దే: టీఆర్ఎస్ ఏడాది పాలనపై దాసోజు శ్రవణ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేవంలో సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ సర్కారు రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
రెండోసారి అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఆచరణకు నోచుకోని పథకాలతో ప్రజలను బురిడీ కొట్టించారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. మాయమాటలతో మభ్యపెడుతూ ఫాంహౌస్కే పరిమితమైన చరిత్ర కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, రాష్ట్ర ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని మండిపడ్డారు.
పాలనాపరంగా చూస్తే కేసీఆర్ మొదటి ఏడాది పూర్తిగా విఫలమైందని, నిరాశపర్చిందని శ్రవణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటూ ఇప్పటికే రూ. 3లక్షల కోట్లకుపైగా అప్పులు తీసుకొచ్చారని.. వీటికి వడ్డీలు కట్టడమే సరిపోతుందని కేసీఆర్పై మండిపడ్డారు. రుణాల కోసం ప్రభుత్వ సంస్థలను కూడా తాకట్టు పెట్టిందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వర, ఇతర ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొచ్చారని అన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఒక్క మద్యం ద్వారానే దాదాపు రూ. 20వేల కోట్ల ఆదాయం కేసీఆర్ సర్కారుకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఎక్సైజ్ శాఖపై తప్ప మిగితా ఏ రంగాలపై దృష్టి సారించలేదని విమర్శించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. ఖాళీలను భర్తీ చేయడం, కొత్త ఉద్యోగాలను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రవణ్ ఆరోపించారు. అక్షరాస్యత విషయంలో మనదేశంలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉందని అన్నారు. ప్రజారోగ్యంలో మిగితా రాష్ట్రాలు మెరుగ్గావుంటే.. మన రాష్ట్రంలో మాత్రం సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులు కూడా ఈ రంగానికి చాలా తక్కువగా ఉన్నాయన్నారు.