ఆపరేషన్ ఆకర్ష్: 'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నిస్సిగ్గుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారని, అలాంటిది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ విషయంతో టీఆర్ఎస్ కొత్త రాజకీయాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తాజాగా టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను ప్రారంభించిందని అన్నారు. టీఆర్ఎస్లో చేరితే అభివృద్ధి సాధ్యమంటున్నారని అన్న దాసోజు, బీజేపీలో టీఆర్ఎస్ను విలీనం చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని, రైతులను పట్టించుకోకుండా పదకొండు ఎకరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ భవంతి నిర్మించుకోవడం ఆయన అధికార దర్పానికి నిదర్శమని అన్నారు.
ఈనెల 15, 16న ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా డబుల్ బెడ్ రూం ఇళ్లతో పాటు శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు సీఎం శంఖుస్థాపన చేయనున్నారు.
కాగా ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 20వతేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సీఎం కేసీఆర్ ఖమ్మం పర్యటనను వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి.