పవన్ మారలేదు, అదే తపన, అప్పుడు చిరు మెచ్చుకున్నారు: దాసోజు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నాటి ప్రజారాజ్యం నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
చిరంజీవి మెచ్చుకున్నారు..
‘నాడు ప్రజారాజ్యం పార్టీ ప్రారంభ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కళారూపాల ప్రదర్శన ఎలా చేయాలనే డెమానిస్ట్రేషన్ మా టీవీలో చూపించాం. అప్పుడు, చిరంజీవి గారు చూసి బాగా మెచ్చుకున్నారు' అని శ్రవణ్ గుర్తు చేసుకున్నారు.
పవన్ పిలుపుతో..
కాగా, ఈ వ్యవహారాలన్నింటిని పవన్ కల్యాణ్ గారు చూసేవారు. ఆయనకు నేను సహాయపడుతుండే వాడిని. ఓ ఎనిమిది నెలల పాటు ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేయమని పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో నాతో అన్నారు. ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి వచ్చేశా... నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే' అని దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు.
పవన్లో అదే తపన
అంతేగాక, ‘నాడు ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్లో ఇప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే తపన పోలేదు. పవన్ తనను, తన కెరీర్ని కాపాడుకుంటూనే పార్టీని రక్షించుకోవాలి. రాజకీయాల్లో పవన్ విజయవంతమవుతారని.. విజయవంతం కావాలని ఆశిస్తున్నా' అని శ్రవణ్ కుమార్ అన్నారు.
అప్పుడు కీలకంగా..
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో దాసోజు శ్రవణ్ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని కోరుకుంటుండటం గమనార్హం.