100 సీట్లు వచ్చేలా ఈవీఎంలలో ట్యాంపరింగ్: శ్రవణ్, అందుకే గెలిచారు: దత్తాత్రేయ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ట్యాంపరింగ్కు పాల్పడిందని, దేశమంతా ఈవీఎంలలో ప్రింటింగ్ మిషన్లలో పెడితే, గ్రేటర్ ఎన్నికల్లో వాటిని ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆదివారం ప్రశ్నించారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధికార పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని, ఖచ్చితంగా 100సీట్లు వచ్చేలా వాటిని ఏర్పాటు చేశారన్నారు. అధికార పార్టీ నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయిందని ఆరోపించారు. తాము సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
ఏ చట్టం ప్రకారం నోటాను పక్కన పెట్టారో ఈసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు ప్రింటర్ను వాడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎక్కడా ప్రింటర్ వాడలేదన్నారు. బిహార్, ఢిల్లీ ఎన్నికల్లో ప్రింటర్లు వాడారని, హైదరాబాద్లో ఎందుకు వాడలేదని ప్రశ్నించారు.
టిఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు: దత్తాత్రేయ
డబుల్ బెడ్ రూం హామీనే తెరాసను గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించిందని కేంద్రమంత్రి, బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. డబుల్ బెడ్ రూం పథకంలో కేంద్రం వాటా కూడా ఉందని, దీనిని తాము సరిగా ప్రచారం చేయలేకపోయామన్నారు. బిజెపి ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
ఎన్ఎస్ఆర్డీలో జరిగిన హైదరాబాద్ యూత్ అసెంబ్లీ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు అనూహ్య ఫలితాలు వచ్చాయని, 3 నెలల నుంచి తెరాస ప్రచారం చేయడం వల్లే ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు.
ఎక్స్ అఫిషియో సభ్యులతోనైనా గెలుస్తామని తెరాస నేతలు చెప్పడంతో ప్రజలు నమ్మారు. రెండు పడక గదుల ఇళ్లు కూడా తెరాస విజయానికి కారణమైందన్నారు. తమ పార్టీ ఓటమికి గల కారణాలపై ఆత్మావలోకనం చేసుకుంటామని వెల్లడించారు.