పెద్ద నోట్లతో టికి రూ.2వేల కోట్ల నష్టమా, కేసీఆర్ ఫిర్యాదు చేయలేదట: దత్తాత్రేయ
హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ.2వేల కోట్లు నష్టం వాటిల్లితుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం నాడు స్పష్టం చేశారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు గవర్నర్కు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని తెలుసుకునేందుకు గవర్నర్ను కలిశానని చెప్పారు. అసలు పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నష్టం వస్తుందన్న విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో చర్చ జరపలేదని గవర్నర్ తనకు చెప్పినట్లు దత్తాత్రేయ స్పష్టం చేశారు.
గవర్నర్ వద్ద బడ్జెట్ రీ ఆర్గనైజేషన్పై మాత్రమే చర్చ జరిగినట్లు చెప్పారు. మూడు రోజుల లావాదేవీలు పరిగణనలోకి తీసకుని నష్టం వాటిల్లుతోందన్న అభిప్రాయానికి రావడం సరికాదన్నారు.
నోట్ల రద్దు, తెలంగాణకు భారీ నష్టం: ఇవీ కారణాలు.. కేసీఆర్ వెల్లడి (పిక్చర్స్)
ఆయన ఇంకా మాట్లాడుతూ.. దేశం మొత్తం బ్యాంకింగ్ మయం కావాలన్నారు. 150 పథకాలకు కేంద్రం నిధులు రాష్ట్రాలకు నేరుగా వస్తాయని చెప్పారు. నల్ల ధనం ప్రభావం దేశవ్యాప్తంగా ఉందని ఆయన చెప్పారు. ఒక రాష్ట్రంతో ముడిపెట్టడం చవకబారుతనమన్నారు.
కాగా, కేంద్రం రాష్ట్రానికి చెల్లించాల్సిన పన్నుల వాటాను అర్ధాంతరంగా తగ్గించిందని గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను తగ్గింపు వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బంది కలుగుతుందని, నిర్దేశించుకున్న కార్యక్రమాల అమలు కష్టమవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు ప్రభావంతో పాటు రూ.500, రూ.వేయి నోట్ల రద్దు పర్యవసానాలు, ఏపీ సచివాలయ, శాసనసభ భవనాల స్వాధీనం తదితర అంశాలపై చర్చించారని వార్తలు వచ్చాయి. రూ.500, రూ.వేయి నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి నెలకు రూ.వేయి కోట్ల నుంచి రూ.రెండువేల కోట్ల మేరకు నష్టం జరుగుతుందని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది.