హైదరాబాద్లో దారుణం : మామ లైంగిక వేధింపులకు కోడలు బలి..
హైదరాబాద్లో దారుణం జరిగింది. కన్నతండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలిని లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. గతంలో అతని లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. తండ్రి లాంటి వాడని నచ్చజెప్పారు. కానీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
మామ వేధింపులు..
బషీర్బాగ్లోని పూల్ బాగ్కు చెందిన ప్రియాంక (25), లోయర్ ట్యాంక్బండ్ పరిధిలోని గాంధీనగర్కు చెందిన రమేష్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకోవడంతో పెళ్లి సజావుగా సాగింది. ప్రస్తుతం వీరికి ఏడు నెలల పాప కూడా ఉంది. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో మామ రూపంలో ప్రియాంకకు ఊహించని షాక్ ఎదురైంది.
బుధవారం సాయంత్రం పుట్టింటికి..
కొంత కాలంగా రమేష్ తండ్రి వెంకటేష్ (50) కోడలు ప్రియాంక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ప్రియాంక ఈ విషయాన్ని పలుమార్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడింది. అయితే వాళ్లు మాత్రం అతను తండ్రి లాంటి వాడని నచ్చజెప్పి పంపించేవారు. ఇదే క్రమంలో రమేష్ బుధవారం సాయంత్రం భార్య ప్రియాంక,కూతురును పూల్బాగ్లోని ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద దింపి వెళ్లాడు.
భర్తతో ఫోన్ మాట్లాడుతూ..
పూల్బాగ్లోని జేఎన్ఎన్ యూఆర్ఎం ప్రభుత్వ క్వార్టర్స్ రెండో అంతస్తులో ఆమె తల్లిదండ్రులు నివసిస్తున్నారు. అదే క్వార్టర్స్ భవనంలో మూడో అంతస్తులో ఆమె సోదరుడు ఉంటున్నారు. గురువారం ఉదయం అందరూ పనులకు వెళ్లిపోయాక.. ప్రియాంక భర్తకు ఫోన్ చేసింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో అతనితో మాట్లాడుతూ మూడో అంతస్తులోని సోదరుని ఇంటికి వెళ్లింది.
Recommended Video
ఉరేసుకుని బలవన్మరణం
కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు వచ్చి తలుపు తట్టగా ప్రింయాక తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటీలోకి నుంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయింది. ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమె మామ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.