ఇండోర్ నుంచి తల్లిదండ్రుల కోసం..: బాసరలో ‘డాటర్ ఆఫ్ ఇండియా’ గీత
ఆదిలాబాద్: బాల్యంలో తప్పిపోయి పాకిస్థాన్లో చిక్కుపోయి.. అప్పటి విదేశాంగ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ చొరవతో స్వదేశమైన భారత్కు తిరిగి వచ్చిన గీత ఇప్పుడు తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమయ్యారు. సుష్మా స్వరాజ్ ఆమెను డాటర్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్న విషయం తెలిసిందే.
మంగళవారం బాసరకు వచ్చిన గీత ఆలయాలను సందర్శించారు. తన కుటుంబసభ్యులను వెతికే క్రమంలోనే ఆమె ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్ మధ్యప్రదేశ్ వారు చూసుకుంటున్నారు. వారి సహకారంతోనే ఆమె బాసరకు వచ్చారు.
కాగా, దాదాపు 20ఏళ్ల క్రితం తప్పిపోయిన గీత.. పాకిస్థాన్ చేరుకుంది. అక్కడి ఈద్ ఫౌండేషన్లో 15 సంవత్సరాలు ఉంది. సుష్మా స్వరాజ్ సహకారంతో ఐదేళ్ల (అక్టోబర్ 23, 2015) క్రితం ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. ప్రస్తుతం ఆనంద్ సర్వీస్ సొసైటీ ఇండోర్లో ఉంటున్నారు.
తన చిన్న తనంలో తమ వారు ఇడ్లీలు తినేవారని, ధాన్యం ఎక్కువగా పండించేవారని సైగలతో గీత వివరించింది. ఆమె చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. గీత తల్లిదండ్రుల కోసం వెదుతుకున్నారు. ఆమె తల్లిదండ్రులు తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారై ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రుల ఆచూకీ మాత్రం లభించలేదు.