పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్
హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నుంచి పట్నం చేరిన ఆ కుటుంబంలో కూతురు విషాదం మిగిల్చింది. కట్టుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిపోయి.. ఒక్కగానొక్క కూతురు జైలుకెళ్లే పరిస్థితిలో ఆ తండ్రి బాధ వర్ణనాతీతం. తల్లిని కిరాతకంగా చంపి ఈ కేసును తండ్రి మీదకు నెట్టేయాలని చూసిన కూతురు చివరకు తానే ముద్దాయిగా తేలడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిందితులను అరెస్ట్ చేసిన రాచకొండ కమిషనరేట్ పోలీసులు మీడియా ఎదుట ప్రవేశ పెట్టడంతో మరిన్ని నిజాలు వెలుగు చూశాయి.
ఒక్క కూతురని గారాబంగా పెంచడంతో
యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నిర్నాముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆ క్రమంలో పదేళ్ల కిందట భార్య రజిత, కూతురు కీర్తితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకున్నారు. హయత్నగర్ పరిధిలోని ద్వారకా సాయి నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్ 4లో సొంతిల్లు కట్టుకున్నాడు. ఒకే ఒక్క కూతురు కావడంతో కీర్తిని కాస్తా గారాబంగా పెంచారు. ప్రస్తుతం ఆమె దిల్సుఖ్ నగర్లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నట్లుగా తెలుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా.. కీర్తి వేసిన తప్పటడుగు ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. భార్య చనిపోయి, కూతురు జైలు పాలై చివరకు శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నంతలో కూతురును బాగా చూసుకున్న ఆ తండ్రికి ఇప్పుడు ఎవరూ దిక్కులేకుండా పోయినట్లైంది.
మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!
మైనర్గా ఉన్నప్పుడే బాల్రెడ్డితో పరిచయం
హయత్నగర్లో వెలుగు చూసిన కన్నతల్లి హత్య కేసులో నిందితులు బాల్రెడ్డి, శశి కుమార్, కీర్తిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. ఈ సందర్భంగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న కీర్తి మైనర్గా ఉన్నప్పుడే బాల్రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ క్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగి పెళ్లి కూడా చేసుకుందామని డిసైడయ్యారు. అయితే తరచుగా బాల్రెడ్డి ఇంట్లో వీరిద్దరు కలుసుకుని హద్దులు దాటారు. దాంతో 2018 సెప్టెంబర్ నెలలో కీర్తి గర్భం దాల్చింది.
ప్రేమ ముసుగులో హద్దులు దాటి.. గర్భం తెచ్చుకుని
ఆ క్రమంలో తనకు గర్భస్రావం చేయించాలంటూ బాల్రెడ్డిపై వత్తిడి పెంచింది కీర్తి. అయితే హైదరాబాద్లో ఐతే అందరికీ తెలిసిపోతుందని.. తనకు తెలిసిన డాక్టర్ మహబూబ్నగర్ జిల్లాలోని ఆమంగల్లో ఉన్నాడని అక్కడకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో కీర్తి ఇల్లు దాటి బయటకు రావాలంటే ఆమె తల్లి పర్మిషన్ కావాలనే ఉద్దేశంతో పక్కింటి కుర్రాడైన శశి కుమార్ సాయం కోరింది. తనను ఏదో ఫంక్షన్కు తీసుకెళుతున్నానంటూ అమ్మకు చెప్పి ఆమంగల్కు వెళదామని ఉన్న విషయమంతా చెప్పింది. దాంతో సంగారెడ్డిలో ఫంక్షన్ ఉందని.. కీర్తిని తమ వెంట తీసుకెళతామంటూ ఆమె తల్లిని శశి కుమార్ ఒప్పించాడు. అలా బాల్రెడ్డి, శశి కుమార్, కీర్తి కలిసి ఆమంగల్ వెళ్లి రెండు రోజులు అక్కడే ఉండి ఆమెకు అబార్షన్ చేయించారు.
అబార్షన్ విషయం తల్లికి చెబుతానంటూ బ్లాక్ మెయిల్
అదలావుంటే కీర్తికి అబార్షన్ చేయించిన విషయాన్ని శశి కుమార్ అస్త్రంగా వాడుకున్నాడు. ఆమంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజుల తర్వాత తనలోని రాక్షసుడిని బయటపెట్టాడు. తనతో శారీరకంగా కలిస్తే ఓకే.. లేదంటే అబార్షన్ విషయం ఆమె తల్లికి చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. అయితే కీర్తి తొలుత నిరాకరించినా.. చివరకు అతడి వేధింపులు భరించలేక ఓకే చెప్పింది. అలా వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెను చాలాసార్లు లోబర్చుకున్నాడు. కొన్నిసార్లు కుదరదని చెబితే.. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు.
పక్కింటి కుర్రాడితో అలా.. మద్యం తాగి.. కన్నతల్లి హత్య కేసులో మరెన్నో ట్విస్టులు..!
శారీరకంగా వాడుకోవడమే కాదు.. 10 లక్షల కోసం డిమాండ్
అలా కీర్తిని శారీరకంగా వాడుకున్న శశి కుమార్ తనలోని మరో కోణం కూడా బయట పెట్టాడు. 10 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని పట్టుబట్టాడు. అంత పెద్ద మొత్తం తాను ఎక్కడి నుంచి తేవాలని నిలదీసింది కీర్తి. అలా చాలా సార్లు ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. అడిగిన 10 లక్షలు ఇస్తావా.. లేదంటే ఆ వీడియోలు బయటపెట్టనా అంటూ బెదిరించేవాడు. అలా ఎన్నిసార్లు తనను అడిగినా డబ్బులు లేవని సమాధానం ఇచ్చేది కీర్తి. దాంతో శశి కుమారే కల్పించుకుని ఆమె తల్లిని హత్య చేస్తే డబ్బులు వస్తాయని ట్రాప్ చేశాడు.
10 లక్షలు ఇవ్వాలంటే ఉపాయం.. అదే తల్లిని మట్టుబెట్టడం..!
కీర్తి తల్లి చిట్టీలు వేస్తూ డబ్బులు కూడబెట్టేది. అలాగే భూములు కూడా ఉన్నాయి. దాంతో కీర్తి నుంచి 10 లక్షలు తీసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుందని భావించాడు. ఒకవేళ తాను కోరినట్లు డబ్బులు ఇవ్వకుంటే బాల్రెడ్డికి ఆ వీడియోలు చూపించి పెళ్లి జరగకుండా చూస్తానని కూడా భయపెట్టాడు. దాంతో పెళ్లి ఆగిపోతే బాగుండదని భావించి శశి కుమార్ చెప్పినట్లు నడుచుకుంది కీర్తి. ఆ క్రమంలోనే అతడితో కలిసి తల్లిని హత్య చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా శశి కుమార్, కీర్తిపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే బాల్రెడ్డిపై కూడా వివిధ కేసులు నమోదు చేసి పోక్సో చట్టం కింద మరో కేసు ఫైల్ చేశారు.
ఉద్యోగాల పేరిట వల విసిరి.. లక్షల రూపాయలు కాజేసి.. దుబాయికి పరార్..!
తెలిసీ తెలియని వయసులో ఎంత అనర్థం..!
హత్య జరిగిన తర్వాత తనకు ఏమి తెలియనట్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది కీర్తి. అయితే కన్నకూతురు ఇంత కిరాతకంగా మారిన ఈ కేసులో సైకలాజికల్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు సీపీ. 23 ఏళ్ల బాల్రెడ్డి బీటెక్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల శశి కుమార్ ఉద్యోగం సజ్జోగం లేకుండా తిరుగుతున్నాడు. ఇక కీర్తి ప్రస్తుత వయసు 19 ఏళ్లు. మైనర్గా ఉన్నప్పుడే బాల్రెడ్డితో పరిచయం ఏర్పడటం.. ప్రేమకు దారి తీయడం.. పెళ్లి చేసుకోవాలనుకోవడం.. ఇదంతా చూస్తుంటే లైఫ్లో ఒక క్లారిటీ అనేది లేకుండా ముగ్గురు ప్రవర్తించిన తీరును ఎవరూ హర్షించరు. చివరకు మూడు కుటుంబాల పరువు రోడ్డెక్కింది. అటు భార్యను కోల్పోయి.. ఇటు కూతురు జైలు పాలు కావడంతో.. కీర్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.