అధికారులు పాడుగాను.. చచ్చినోడికి కూడా పెన్షన్ ఇస్తున్నారు
హైదరాబాద్ : టెక్నాలజీ తీసుకొచ్చిన తంటో లేదా అధికారుల తీరో తెలియదు కానీ .. యధేచ్చగా తప్పులు జరుగుతున్నాయి. సాధారణంగా పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తిరుగుతుంటారు. ఒక్కమాటకు పెన్షన్ ఇచ్చే రోజులు కాదు. సరే ఇచ్చిన పెన్సన్ను సక్రమంగా ఇస్తామని చెప్తారు. నెలకోసారి సంతకాలు పెట్టించుకుంటారు. ఆర్నెల్లకోసారి వెరిఫై చేస్తుంటారు. కానీ రాజధానికి కూతవేటు దూరంలో మాత్రం చచ్చిన వృద్ధుడికి పెన్షన్ పడుతుంది.
నాగోల్ డివిజన్ ఫత్తుల్లాగూడకు చెందిన కాటేపాక సుక్కయ్య వృద్దాప్య పింఛను లబ్ధిదారుడు. అతనికి నెల నెల పెన్షన్ వచ్చేది. అయితే గతేడాది ఫిబ్రవరిలో అతను చనిపోయాడు. కానీ అతని బ్యాంకు ఖాతాలో మాత్రం పెన్షన్ జమవుతుంది. సుక్కయ్య చదువుకోలేదు కాబట్టి .. ఏటీఏం కార్డు తీసుకోలేదు. దీంతో అతని ఖాతాలో పెన్షన్ పడుతుంది. సుక్కయ్య పెన్షన్ అధికారులు ఆపివేస్తారెమోనని కుటుంసభ్యులు భావించారు. కానీ పెన్షన్ ఆగలేదు సరికదా .. పెరిగిన పెన్షన్ కూడా ఖాతాలో పడటంతో విషయం వెలుగుచూసింది.
సుక్కయ్య చనిపోయిన నెలరోజులకు కుటుంబసభ్యులు జీహెచ్ఎంసీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. బల్దియా డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసినా .. ఆసరా వెబ్ సైట్లో మాత్రం సుక్కయ్య బతికి ఉన్నట్టే సమాచారం ఉంది. ఇది మన అధికారుల పనితీరుకు నిదర్శనం. గతేడాది నుంచి 17 నెలలు .. నెలకు రూ.వెయ్యి చొప్పున రూ.17 వేలు జమయ్యాయి. అంతేకాదు పెరిగిన ఫించను కూడా రూ.2016 అకౌంట్లో క్రెడిట్ అయ్యింది. ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే అధికారులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి. అర్హులకు పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిప్పుకుంటారు. మరీ ఇచ్చిన పెన్షన్దారుడు బతికున్నాడా లేదా అనే అంశాన్ని సరిచూసుకోరు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.