ఇదేం వింత: గజ్వేల్లో చనిపోయిన వ్యక్తి ఓటేసి వెళ్లాడు..!
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. అయితే విపక్షాలు ఈవీఎంలలో ఏదో మాయ జరిగిందని ఆరోపిస్తున్నాయి. అంతేకాదు రాష్ట్ర ఎన్నికల అధికారి చెబుతున్న లెక్కలకు కేంద్ర ఎన్నికల సంఘం చూపిస్తున్న లెక్కలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓ ఘటన వెలుగు చూసింది. చనిపోయిన వ్యక్తి ఓటు వేయడంతో మరోసారి ఎన్నికల సంఘం పై విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడ ఓటేశారో తెలుసా...
తెలంగాణ ఎన్నికలు చాలా సజావుగా ముగిశాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న దాఖలాలు కనిపించలేదు. కానీ ఓటు వేసేందుకు వినియోగిస్తున్న ఈవీఎంలపై విపక్షాలు పోలింగ్ ముగిసిన నాటినుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే గెలవలేక ఇలాంటి కబుర్లు చెబుతున్నారని అధికార పక్షం టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. మరి చాలా చోట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం చూపిస్తున్న లెక్కలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్న లెక్కలకు పొంతన కుదరడం లేదు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో సర్వత్రా అనుమానాలు నెలకొంటున్నాయి. అలాంటి చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో గెలవడంతో ఈ అనుమానాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
చనిపోయిన వ్యక్తి ఓటు వేయడమా..?
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జెన్నపల్లి నర్శింహారెడ్డి (EPIC NO.AP 322220351542) చిన్నకిష్టాపూర్లోని జిల్లా పరిషత్ హైస్కూలులో డిసెంబర్ 7న ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం కూడా చెబుతోంది. అయితే వాస్తవానికి నర్శింహారెడ్డి చనిపోయి మూడున్నరేళ్లు అవుతోంది. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారి పేరుమీద వీవీప్యాట్ స్లిప్పులు జారీ అయ్యాయి కానీ బతికున్న వారి ఓట్లు మాత్రం గల్లంతయ్యాయి. డిసెంబర్ 7న జరిగిన పోలింగ్లో ఇలాంటివి ఘటనలు చాలా వెలుగు చూశాయి. అయితే వాటిని బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తపడ్డారని సమాచారం. ఇక ఫలితాలు ఎలాగు బయటకొచ్చాయి కనుక చిన్నగా ఆ విషయాన్ని ఏమార్చే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర పట్టుబడ్డ 200 ఓటరు కార్డులు
ఇదిలా ఉంటే ప్రముఖ ఆంగ్ల పత్రికతో నర్శింహారెడ్డి కుటుంబ సభ్యులు తను మరణించిన విషయాన్ని చెప్పారు. మార్చి 2016లో నర్శింహారెడ్డి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఓటరు జాబితా నుంచి నర్శింహా రెడ్డి పేరును తొలగించాల్సిందిగా జిల్లా ఎన్నికల సంఘం అధికారులకు సూచించింది. చనిపోయిన 32 నెలల తర్వాత కూడా నర్శింహారెడ్డి పేరుతో ఓటరు స్లిప్పు జారీ అయ్యింది. మరో ఘటనలో పోలింగ్ బూత్ అధికారి దగ్గర 200వ ఓటరు ఐడీ కార్డులు పట్టుబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కె.రమేష్ అనే వ్యక్తిని బూత్ లెవెల్ ఆఫీసర్గా ఎన్నికల సంఘం అపాయింట్ చేసింది. ఎన్నికల విధులు నిర్వహించాల్సిన రమేష్ 200 ఓటర్ ఐడీలతో చిక్కడం కలకలం రేపింది.
దొంగ ఓటు వేసేందుకు వచ్చిన పువ్వాడ అజయ్కుమార్ కాలేజీకి చెందిన విద్యార్థులు
ఇక ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న పువ్వాడ అజయ్కుమార్కు చెందిన మమతా మెడికల్ కాలేజీకి చెందిన 200 మంది విద్యార్థులు ఉదయం 8గంటలకు ఓటువేసేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. వారు చనిపోయిన వ్యక్తుల స్థానంలో ఓటు వేసేందుకు రాగా పట్టుబడ్డారు. మరికొంత మంది ఓటువేసేందుకు రాకపోవడంతో వారికోసం ఓటు వేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ విద్యార్థి ఓటరు స్లిప్పు పట్టుకుని ఉండగా బ్లాక్ అధికారులు ప్రశ్నిస్తుండటంతో టీడీపీ అభ్యర్థి నామానాగేశ్వరరావు ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లాడు. దీంతో ఆ విద్యార్థి మెడికల్ కాలేజీలో చదువుతోందని పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతుగా ఓటు వేయాలని బలవంతం చేసినట్లుగా చెబుతున్నట్లు వీడియోలో రికార్డ్ అయ్యింది.
ఇలా ఒక్క చోట కాదు చాలా చోట్ల ఇలాంటి అవకతవకలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఎందుకు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలకు గురవుతోంది.