కొంప ముంచిన దినకర్మ ... ఆ గ్రామంలో 100 మందికి పైగా కరోనా కేసులు
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిగా ప్రస్తుతం కరోనా వైరస్ అందరినీ టెన్షన్ పెడుతుంది. అటువంటి కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రభుత్వ చర్యలే కాకుండా, స్వీయ నియంత్రణ కూడా అవసరం. కరోనా వైరస్ పై ఎంత అవగాహన కలిగించినా, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చాపకింద నీరులాగా కరోనా విస్తరిస్తూనే ఉంది .
కరోనా వ్యాప్తికి పెళ్లిళ్లు, పేరంటాలు, పుట్టినరోజు వేడుకలు, సహపంక్తి భోజనాలు కారణమవడం తరచుగానే చూస్తున్నాం. వందల సంఖ్యలో ఫంక్షన్ లకు వెళ్లి కరోనాను తెచ్చుకున్న ఉదంతాలు రోజూ చూస్తున్నాం . తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఒక దినకర్మ కరోనా వ్యాప్తికి కారణమైంది. దీంతో ములుగు కరోనాకు హాట్ స్పాట్ గా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్కే పురం లో ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించి గ్రామంలో దిన కర్మలు నిర్వహించారు. సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కరోనా విషయాన్ని మర్చిపోయిన చాలామంది ఈ దిన కర్మలకు హాజరై సహపంక్తి భోజనాలలో పాల్గొన్నారు .
దినకర్మల్లో పాల్గొనటమే వారి కొంపముంచింది. చాలామంది కరోనా బారిన పడడానికి కారణమైంది.
మొత్తం వి ఆర్ కే పురం గ్రామంలో 500లోపు జనాభా ఉంటారు. ఇక ఆ జనాభాలో ప్రస్తుతం 100 పాజిటివ్ కేసులు నమోదు కావడం గ్రామస్తులను ఉలిక్కి పడేలా చేసింది. అటు అధికారులు సైతం అప్రమత్తమై మిగతా వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వి ఆర్ కే పురం గ్రామాన్ని అధికారులు క్వారంటైన్ చేశారు. గ్రామంలోని రహదారులను దిగ్బంధించారు. కరోనాతో బాధపడుతున్నవారికి వైద్య సహాయం అందించడమే కాకుండా, కరోనా టెస్టులు చేయించుకోని వారిని గుర్తించే పనిలో పడ్డారు.