హైదరాబాద్ జంట పేలుళ్లు: ఉరిశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు
Recommended Video
హైదరాబాద్: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్లోని జంట పేలుళ్ల కేసులో నేరస్తులకు న్యాయస్థానం సోమవారం ఉరిశిక్ష విధించింది. 2007 ఆగస్ట్ 25వ తేదీన గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన బాంబు దాడుల్లో 40 మందికి పైగా మృతి చెందారు.
ఈ కేసులో ఏ1, ఏ2 అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీద్ సయ్యద్లను న్యాయస్థానం నేరస్తులుగా తేల్చింది. మరో నిందితుడు తారిఖ్ అంజుమ్ను కూడా సోమవారం (10-09-2018) దోషిగా తేల్చింది. ఇందులో మొదటి ఇద్దరు నేరస్తులకు ఉరిశిక్ష విధించింది. మూడో నేరస్తుడు తారిఖ్ అంజుమ్కు యావజ్జీవ శిక్ష విధించింది.
పలువురు సాక్షుల విచారణ
25 ఆగస్ట్ 2007లో జంట పేలుళ్లు (గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో పేలుళ్లు) చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో 44 మంది వరకు మృతి చెందారు. 68 మందికి పైగా గాయాలు అయ్యాయి. ప్రత్యేక కోర్టు ఈ జంట పేలుళ్ల కేసులో మొత్తం 286 మంది సాక్షులను ప్రశ్నించింది. అనంతరం సోమవారం (10-09-2018) ముగ్గురికి శిక్ష ఖరారు చేసింది. చర్లపల్లిలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఈ శిక్షను ఖరారు చేసింది. 11 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది.
దోషులకు ఆశ్రయం కల్పించినందుకు జీవితఖైదు
ఈ కేసులో మరికొందరు పరారీలో ఉన్నారు. ప్రధాన సూత్రధారులు అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్లు పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఏ1 అనీఖ్ షఫీక్ సయ్యద్, ఏ2 ఇస్మాయిల్ చౌదరిలకు ఇప్పుడు కోర్టు ఉరిశిక్ష విధించింది. దోషులకు ఆశ్రయం కల్పించినందుకు తారిఖ్కు జీవిత ఖైదు విధించింది.
దిల్సుఖ్ నగర్లో బాంబు నిర్వీర్యం
ఈ జంట పేలుళ్లకు 8 మందితో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్, ఫరూక్ షర్బుద్దీన్, మహ్మద్ సాధిక్ అన్సారీలను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో బాంబులు పేలాయి. దిల్ సుఖ్ నగర్లోను మారణహోమానికి ఇస్మాయిల్ కుట్ర చేశారు. ఇక్కడ బాంబు నిర్వీర్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆ బాంబు కూడా పేలి ఉంటే మరింత పెను ప్రమాదం జరిగేది.
68 సాంకేతిక లోహ ఆధారాల సేకరణ
68 సాంకేతిక లోహ ఆధారాలను పోలీసులు సేకరించారు. 1125 పేజీల ఛార్జీషీటు దాఖలు చేశారు. లుంబినీ పార్క్ వద్ద పేలుడులో 12 మంది చనిపోగా, గోకుల్ చాట్ వద్ద 32 మంది మృతి చెందారు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఏడుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులే.