పుట్టిన రోజే మరణ శాసనం.. పోలీసుల భయంతో పోయిన ప్రాణం
కరోనా లాక్ డౌన్ తో ఓ యువకుడు పుట్టిన రోజే మృత్యు ఒడికి చేరుకున్నాడు . తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని భావించిన వ్యక్తికి పుట్టిన రోజే చివరి రోజైంది. కరోనా లాక్ డౌన్ తో షాపులు లేవు, కేకులు లేవు, తాగటానికి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యటానికి వైన్ షాప్స్ , బార్స్ , రెస్టారెంట్స్ లేవు . దీంతో కనీసం కల్లు తాగి అయినా పుట్టిన రోజు చేసుకుందామని భావించి తాటి వనాలకు వెళ్ళటమే అతని పాలిట శాపమైంది. పోలీసుల రాక అతనికి మరణ శాసనం అయ్యింది .
వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆడెపు రాజగోపాల్ పుట్టి రోజు సందర్భంగా స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. సరదాగా పుట్టిన రోజు గడుపుదాం అనుకుని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామ శివారులోని తాటి వనానికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి కల్లు తాగుతున్న క్రమంలో అటువైపుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది. దీంతో పోలీసులు గుంపుగా ఉన్న జనాలపై లాఠీలు ఝుళిపిస్తారన్న భయంతో వారంతా పొలాల వైపు పరుగులు తీశారు.
రాజగోపాల్ సాయంత్రం చీకటి పడిన సమయం కావటంతో భయంతో పరుగులు తీస్తూ చీకట్లో వ్యవసాయ బావి కానరాక బావిలో పడ్డాడు. దీంతో బావిలో పడ్డాడని గుర్తించి గుంపుగా ఉన్న ప్రజలను చూసిన ఎస్.ఐ ప్రీతి సుధా ఘటన స్థలానికి చేరుకుని రాజగోపాల్ను బావి నుండి బయటికి తీయించి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే రాజగోపాల్ మృతి చెందాడు. రాజగోపాల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టిన రోజే విగతజీవిగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు శోకిస్తున్నారు . పోలీసులు అక్కడకు రాకుంటే రాజగోపాల్ కు ఆ పరిస్థితి వచ్చేది కాదని , పోలీసులను చూసి భయంతో పరుగెత్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని లబోదిబోమంటున్నారు కుటుంబ సభ్యులు .