డిసెంబర్ 31 దగ్గరకొస్తోంది.. మీ చిప్ కార్డ్ ఏటీఎం తీసుకోలేదా.. అర్జెంట్ గా బ్యాంకులకు వెళ్లండి
హైదరాబాద్ : ఏటిఎం నుంచి డబ్బులు రావడం లేదు.. నా ఏటీఎం పనిచేయడం లేదు.. మొన్నటివరకు బాగానే పనిచేసింది, ఇప్పుడేమైంది. జనవరి ఫస్ట్ తర్వాత చాలామంది నోట ఇలాంటి మాటలు వినిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటారా? ఏటీఎం చిప్ కార్డు తీసుకోకపోవడమే ఇలాంటి మాటలకు కారణం. అలాంటి ఇబ్బందులు రావొద్దనుకుంటే వెంటనే అలర్ట్ కావాల్సిందే.
డిసెంబర్ 31 దగ్గరకొస్తోంది. అర్జెంట్ గా మీరు బ్యాంకులకు వెళ్లాల్సిందే. లేదంటే జనవరి ఒకటి నుంచి మీ ఏటిఎం పనిచేయక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతమున్న మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో చిప్ కార్డులు ఇస్తున్నాయి ఆయా బ్యాంకులు. వీటిని తీసుకునేందుకు డిసెంబర్ 31వ తేదీని గడువుగా విధించాయి. ఒకవేళ అంతలోపు కొత్త చిప్ ఏటీఎం కార్డులు తీసుకోకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే జనవరి ఫస్ట్ నుంచి పాత కార్డులు పనిచేయవు.
కొత్త చిప్ కార్డుల మంత్రం.. మన సొమ్ము భద్రం
ప్రస్తుతమున్న డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మాగ్నటిక్ స్ట్రిప్ తో పనిచేస్తాయి. అయితే వీటి కారణంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ కార్డుల నుంచి డేటా సేకరించడం చాలా సులువు. క్లోనింగ్ ద్వారా అసలు కార్డులకు మాదిరి డూప్లికేట్ కార్డులు సృష్టించి మోసాలు చేస్తున్నారు. దీంతో అసలు కార్డుదారుడు లబోదిబమనాల్సిన పరిస్థితి. మాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో ఆన్లైన్ మోసాలు కూడా చాలా ఎక్కువే. ఏకొద్దిగా ఏమరుపాటుగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు మన కార్డు వివరాలు తస్కరించడం సులభం. అందుకే వీటి స్థానంలో చిప్ కార్డులు జారీచేయాలని ఆదేశించింది ఆర్బీఐ. దీంతో 2019, జనవరి ఒకటి నుంచి చిప్ తో కూడిఉన్న కార్డులు మాత్రమే పనిచేస్తాయి. అందుకే పాత మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో ప్రతిఒక్కరూ కొత్త చిప్ కార్డులు తీసుకోవాల్సిందే.
డిజిటల్ యుగం.. కార్డుల వినియోగం
కాలం మారింది. డిజిటల్ యుగంలో కార్డుల వినియోగం బాగా పెరిగింది. చిన్న చిన్న షాపుల నుంచి పెద్దపెద్ద షోరూముల దాకా కార్డు స్వైప్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మోసాలు కూడా పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. మాగ్నటిక్ స్ట్రిప్ కార్డు వెనకాల ఉండే సీవీవీ తో పాటు కొన్ని వివరాలు తెలిస్తే చాలు ఈజీగా క్లోనింగ్ చేసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిప్ కార్డులు తెరపైకి వచ్చాయి. డిసెంబర్ 31వ తేదీలోగా మీయొక్క సంబంధిత బ్యాంకులకు వెళ్లి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా బ్యాంకుల నుంచి ఖాతాదారులకు ఫోన్లతో పాటు మేసేజ్ లు కూడా వస్తున్నాయి. కొత్తగా ఇస్తున్న చిప్ కార్డులకు బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే ఇప్పటివరకు కొత్త కార్డులు తీసుకున్నవారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త కార్డులతో సైబర్ మోసాలకు చెక్.. వెంటనే తీసుకోండి
ఇప్పటివరకు ఉన్న మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డులతో మోసం చేయడం సైబర్ నేరగాళ్లకు చాలా ఈజీ అయిపోయింది. కానీ కొత్త చిప్ కార్డులతో వారి ఆటలు ఇక సాగవు. ఇన్నాళ్లు మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల వెనకాల ఉండే నల్లటి రంగు మోసగాళ్ల పాలిట వరంలా మారింది. ఎందుకంటే అందులో ఉండే డేటా శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి క్లోనింగ్ చేయడం గానీ, ఆన్లైన్ మోసాలకు గానీ ఆస్కారముండేది. ఇప్పుడు కొత్త చిప్ కార్డులతో అలాంటి సమస్యలుండవు. వీటిలో డేటా డైనమిక్ గా ఉండబోతోంది. అంటే ప్రతి లావాదేవీకి వివరాలు మారుతుంటాయి. ఖాతాదారుల మొబైల్ నంబర్లకు ఈ కొత్త కార్డులు లింక్ చేస్తారు కాబట్టి ప్రతి లావాదేవీలో పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి కొత్త కార్డుల దెబ్బతో సైబర్ నేరగాళ్లకు చెక్ పడినట్లే. డిసెంబర్ 31కి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రతి ఒక్కరూ అలర్ట్ కావాల్సిన అవసరముంది. మీ బ్యాంకులకు వెళ్లి వెంటనే కొత్త కార్డులు తీసుకోండి.