ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల తొలగింపు నిర్ణయం ..హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ప్రభావం?
Recommended Video
ఉద్యమ పార్టీగా మొదలై నేడు అధికార పార్టీగా కొనసాగుతుంది టిఆర్ఎస్ పార్టీ. ఇక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సమ్మె బాట పట్టిన ఉద్యోగులను తొలగిస్తున్నామని ఆయన చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది. హుజూర్ నగర్ ఎన్నికల సమయంలో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవటం గులాబీ పార్టీ కి మైనస్ అవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల తొలగించినట్టే అని ప్రకటించిన సీఎం కేసీఆర్
అక్టోబర్ 5వ తేదీ నుండి తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ గట్టెక్కాలంటే ఏపీ తరహాలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే దసరా పండుగ సమయంలో సమ్మె బాట పట్టారు. దీంతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని సీఎం కేసీఆర్ 5వ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు విధులకు హాజరైన వారిని ఉద్యోగులుగా పరిగణిస్తామని, హాజరు కాకుండా సమ్మె బాట పట్టిన వారిని తొలగించమని ప్రకటించారు.
హుజూర్ నగర్ ఎన్నికలపై సీఎం నిర్ణయం ప్రభావం
అయితే ఒకపక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని గులాబీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్ కెసిఆర్, సమ్మె చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నా లెక్క చేయక పోవడంతో ఇజ్జత్ కా సవాల్ అన్నట్టు ఫీల్ అయ్యారు . 50 వేల మంది సమ్మె బాట పడితే అందులో కేవలం పన్నెండు వందల లోపు మాత్రమే కేసీఆర్ చెప్పినట్లు విధుల్లో జాయిన్ అయ్యారు. అందులో బస్సు డ్రైవర్లు, కండక్టర్లు లేరని తెలుస్తోంది. ఆర్టీసీ ఆఫీసులో పనిచేసే అధికారులు, అధికారుల కోసం నియమించబడిన డ్రైవర్లు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ తన మాటను బేఖాతరు చేసిన ఆర్టీసీ కార్మికులపై జయలలిత తరహాలో కొరడా ఝుళిపించారు.
సీనియర్ నాయకులు చెప్పినా లక్ష్యపెట్టని గులాబీ బాస్
హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులపై ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని పార్టీలోని సీనియర్ నాయకులు చెప్పినప్పటికీ కెసిఆర్ లక్ష్యపెట్టలేదు. ఈనెల 21వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్ తీసుకున్న సంచలన నిర్ణయం అధికార పార్టీని ఇరకాటంలో పెడుతుందనే భావన వ్యక్తం అవుతుంది.సీఎం నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని ఉధృతం చేసేలా ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల పోరాటానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పలు ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి .
సీఎం నిర్ణయం ... నిరంకుశత్వానికి నిదర్శనంగా భావిస్తున్న కార్మిక , ఉద్యోగ సంఘాలు
సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే తొలగింపు నిర్ణయం తీసుకోవడం నిరంకుశత్వానికి నిదర్శనంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యమం ఉధృత రూపం దాలుస్తుంది అని భావిస్తున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న, నిరంకుశంగా వ్యవహరిస్తున్న అధికార గులాబీ పార్టీపై హుజూర్ నగర ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. ఇంతవరకు హుజూర్ నగర్ లో గులాబీ జెండా ఎగురవేయాలి అని ప్రయత్నం చేస్తున్న గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఇప్పటివరకు హుజూర్ నగర్ లో విజయం సాధించలేకపోయారు.
కార్మికుల ఆందోళన ఉధృతం అయితే హుజూర్ నగర్ లో ఎఫెక్ట్ పడుతుందని గులాబీ నేతల టెన్షన్
ఇప్పుడు ఈ తరుణంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి , మంత్రులను రంగంలోకి దించి వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ విజయం కోసం పోరాటం చేస్తుంటే, సీఎం కేసీఆర్ తీసుకున్న దాదాపు 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాల తొలగింపు నిర్ణయం , రెండు లక్షల మంది ఆర్టీసీ కార్మిక కుటుంబాలను రోడ్డున పడేస్తూ తీసుకున్న నిర్ణయం హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే రాజకీయ వర్గాలు, అటు సొంత పార్టీ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి హుజూర్ నగర్ ఉప ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులతో సున్నం పెట్టుకున్న కేసీఆర్ ఎన్నికల్లో ఏ మాత్రం సక్సెస్ అవుతారో .